News

జార్ఖండ్‌లో ‘యూసీసీ’ అమలు చేస్తాం : అమిత్‌ షా

262views

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోను కేంద్రహోం మంత్రి అమిత్‌షా ఆదివారం(నవంబర్‌ 3) రాంచీలో విడుదల చేశారు. మేనిఫెస్టోకు సంకల్ప్‌ పత్ర’ అని నామకరణం చేశారు. సంకల్ప పత్రలో బీజేపీ పలు కీలక హామీలిచ్చింది.

బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలు చేస్తామని(గిరిజనులకు మినహాయింపు), ‘గోగో దీదీ’ స్కీమ్‌ కింద మహిళలకు నెలకు రూ.2100 నగదు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడి 25 ఏళ్లు పూర్తయినందున రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన మొత్తం 25 ముఖ్యమైన అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.

బీజేపీ అధికారంలోకి వస్తే జార్ఖండ్‌లో చొరబాటుదారులు ఆక్రమించుకున్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని అమిత్‌షా అన్నారు. చొరబాటుదారులు ఇక్కడికి వచ్చి ఆడపడుచులను ప్రలోభపెట్టి పెళ్లిళ్లు చేసుకొని భూములను ఆక్రమించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చొరబాటుదారులను అరికట్టకపోతే రాష్ట్ర సంస్కృతికి, ఉపాధికి, ఆడబిడ్డలకు భద్రత ఉండదని అన్నారు. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్‌) ప్రవేశపెడతామని, అయితే గిరిజనులను అందులో నుంచి మినహాయిస్తామని క్లారిటీ ఇచ్చారు.