News

చీనాబ్‌ బ్రిడ్జ్‌పై కన్నేసిన పాక్‌.. చైనా కోరిక మేరకు సమాచార సేకరణ

296views

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌ ను జ‌మ్మూక‌శ్మీర్‌లో నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఆ రాష్ట్రంలోని రియాసీ జిల్లాలో చీనాబ్‌ నదిపై ఈ బ్రిడ్జ్‌ను నిర్మిస్తున్నారు. అయితే, ఈ ఎత్తైన వంతెనపై పొరుగు దేశం పాకిస్థాన్‌ కన్నుపడినట్లు తెలుస్తోంది. బ్రిడ్జ్‌కు సంబంధించిన సమాచారాన్ని పాక్‌ సేకరిస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి సమాచారం వచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది. చైనా కోరిక మేరకు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాలు వంతెనకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు సదరు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఆ వివరాలు ఎందుకు తెలుసుకుంటున్నారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.

కాగా, చీనాబ్ రైలు వంతెనను భారతీయ రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఉక్కు, కాంక్రీట్‌తో నిర్మించిన ఈ వంతెన జమ్మూ కశ్మీర్‌లోని జమ్మూ డివిజన్ రియాసి జిల్లా బక్కల్ – కౌరీ మధ్య ఉంది. కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్‌-శ్రీనగర్‌-బారాముల్లా రైల్వే లింక్‌ ప్రాజెక్టులో భాగంగా చీనాబ్‌ వంతెనను నిర్మించారు. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున చీనాబ్‌ నదిపై 1,315 మీడర్ల పొడవైన వంతెనను నిర్మించారు. చైనాలోని బెయిసాన్‌ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్‌ రైల్వే వంతెన పేరుపై ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. ఇక పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్‌ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం విశేషం.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ రైల్వే వంతెన నిర్మాణం దాదాపు పూర్తైంది. దీని నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వానికి 20 ఏళ్లు పట్టింది. ఈ చారిత్రక వంతెనపై ఈ ఏడాది జూన్ 20న తొలి రైలు ట్రయల్‌ రన్‌ను కూడా విజయవంతంగా నిర్వహించారు. తద్వారా కశ్మీర్‌లోని రియాసి నుండి బారాముల్లా వరకు రైలు సేవల ప్రారంభానికి మార్గం సుగమం చేశారు. త్వరలో ఈ వంతెన రైలు సేవలకు అందుబాటులోకి రానుంది.