
కరాగ్రే వసతే లక్ష్మీ, కర మధ్యే సరస్వతీ,
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం
అన్నారు. అరచేతి చివర లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతి, అరచేయి మొదట్లో.. గౌరీదేవి కొలువై ఉంటారు.. ఉదయం లేవగానే చేతులను చూడటం వల్ల.. ముగురమ్మల దర్శనం లభిస్తుందని భావం. అలా చేతులను చూసుకోవడం వల్ల రోజంతా స్థైర్య, ధైర్య, విజయాలు కలుగుతాయన్నది అంతరార్థం. దైవాన్ని కళ్లతోనే కాదు, మనసుతో చూసినా సద్గుణాలు సిద్ధిస్తాయి. ఒక్కసారి మనసు చూడటం మొదలుపెడితే.. దైవజ్ఞులందరూ మన కళ్లేదుటే సాక్షాత్కరిస్తారు. ఒక్కోసారి మనం కళ్లతో చూసేవన్నీ యథార్థం కాకపోవచ్చు. కానీ ఆలోచించే నిర్ణయించే మనసు మాత్రం కచ్చితంగా నిజాన్నే చూపిస్తుంది.
కైకేయి నోట వినిపించిన పద్నాలుగేళ్ల వనవాసమన్న మాటలను రఘువంశ రామయ్య మనసుతో విన్నాడు. సోదరుడి మీద మనసులో ఉన్న అమితమైన ప్రేమే లక్ష్మణుణ్ణి అడవి వైపు నడిపించింది. అశోకవనంలో విషాదమూర్తిని చూసిన హనుమ.. ఆమే సీత అని మనసుతో నిశ్చయించుకున్నాడు. ఆయా సందర్భాల్లో మనసు చూపే దారి, చెప్పే ధైర్యం కొండంత నిశ్చింతను ప్రసాదిస్తాయి. దుఃఖం పీడిస్తున్నప్పుడు.. మనసే గొప్ప నేస్తం. ఏదైనా కోల్పోయినప్పుడు మనసు ఇచ్చే ఊరట.. మోడువారిన కొమ్మను చిగురింప చేసినట్లవుతుంది. జీవితంలో ఎన్ని ఒడుదొడుకులు ఉన్నప్పటికీ.. మనసును మన అధీనంలో ఉంచుకోవాలి. చిన్నపాటి సమస్యకే కుంగిపోతే నీరసించిపోతాం. మసకబారిన నయనాలకు కళ్లద్దాలు అమర్చినట్టే.. అజ్ఞానంతో నిండిన మనసును ధ్యానం, పూజలతో తేటపరచుకోవాలి.