News

రైల్వే స్టేషన్లలో దీపావళి రద్దీ.. ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు

257views

దీపావళి పండుగకు ఊళ్లకు వెళ్లేవారితో రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. దీపావళితో పాటు ఛత్ పూజలకు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తమ ఊళ్లకు తరలివెళుతున్నారు. దీనిని గమనించిన రైల్వేశాఖ ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ఉత్తర రైల్వే పండుగలకు ప్రత్యేక రైళ్లను నడపడమే కాకుండా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వెలుపల ప్రత్యేకంగా సీటింగ్‌ ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ప్రయాణికులకు భోజన సౌకర్యాన్ని అందుబాటులో ఉంచింది. అలాగే ఫ్యాన్లను ఏర్పాటు చేయడంతో పాటు రైళ్ల గురించిన సమాచారాన్ని అందించేందుకు హెల్ప్‌ డెస్క్‌ను, అదనపు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేసింది.

ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పెద్ద సంఖ్యలో ఆర్‌సీఎఫ్, సివిల్ డిఫెన్స్‌ సిబ్బందిని రైల్వే శాఖ మోహరించింది. స్టేషన్‌లో మరిన్ని సౌకర్యాలు కల్పించడంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైల్వేశాఖ ప్రతి సంవత్సరం పండుగలకు ప్రత్యేక రైళ్లను నడుపుతుంటుంది. అయితే ఈసారి పండుగను రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.