News

మెడిసిన్‌లో విక్టర్‌ ఆంబ్రోస్‌, గ్యారీ రువ్‌కున్‌కు నోబెల్‌

331views

2024 సంవత్సరానికిగానూ మెడిసిన్‌ విభాగంలో ఇద్దరికి నోబెల్ బ‌హుమ‌తి ప్ర‌క‌టించారు. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్ట‌ర్ ఆంబ్రోస్‌, గ్యారీ రువ్‌కున్‌ల‌కు నోబెల్ బ‌హుమ‌తి ద‌క్కింది. మైక్రోఆర్ఎన్ఏను ఆ ఇద్ద‌రు శాస్త్ర‌వేత్త‌లు ఆవిష్క‌రించారు. జీన్ రెగ్యులేష‌న్‌లో మైక్రో ఆర్ఎన్ఏ పాత్ర‌ను విశ్లేషించినందుకు ఆ ఇద్ద‌రికి అవార్డును ప్ర‌క‌టిస్తున్న‌ట్లు నోబెల్ క‌మిటీ సోమవారం వెల్ల‌డించింది.

స్వీడెన్‌లోని క‌రోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ మెడికల్‌ యూనివర్సిటీ నోబెల్‌ అసెంబ్లీ మెడిసిన్‌ లో విజేత‌ను ప్ర‌క‌టించింది. అవార్డు కింద 11 మిలియ‌న్ల స్వీడిష్ క్రాన‌ర్(మిలియ‌న్ అమెరికా డాల‌ర్లు) బహుమతిగా అందిస్తారు. గతేడాది ఫిజియాలజీ, మెడిసిన్‌ విభాగంలో.. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినందుకుగాను హంగేరియన్‌ శాస్త్రవేత్త కాటలిన్‌ కరికో , అమెరికాకు చెందిన డ్రూ వెయిస్‌మన్‌తకు నోబెల్‌ పురస్కారం వచ్చింది.

వైద్యశాస్త్రంలో మొత్తంగా ఇప్పటివరకు నోబెల్‌ బహుమతిని 114 సార్లు ప్రకటించగా.. 227 మంది అందుకున్నారు. ఇందులో కేవలం 13 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. కాగా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్స్‌ బహుమతి విజేతల్లో ప్రతి ఏడాది ముందుగా మెడిసిన​ విభాగంలోనే ప్రకటిస్తారు. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్య విభాగాల్లో విజేతలను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున నోబెల్‌ శాంతి బహుమతి, అక్టోబర్‌ 14న అర్థశాస్త్రంలో నోబెల్‌ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.

స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించినవారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. వీటిని ఆల్‌ఫ్రెడ్ జ‌యంతి సంద‌ర్భంగా జ‌ డిసెంబర్‌ 10న విజేతలకు బహుమతులు అందజేస్తారు.