News

అంగరంగ వైభవం.. జగన్నాథుని రథోత్సవం

86views

అనకాపల్లి పట్టణంలోని గవరపాలెంలో కొలువైన సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథస్వామి వారి రథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తుల జయజయ ధ్వానాల మధ్య జగన్నాథుని రథచక్రాలు ముందుకు కదిలాయి. స్వామి నామస్మరణతో వీధులు మార్మోగాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని, పూజలు జరిపారు. జగన్నాథస్వామి ఆలయంలో స్వామి వారిని ఎంపీ సీఎం రమేష్‌, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణలు దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. తొలుత స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం రథయాత్రను ప్రారంభించారు. గవరపాలెం నుంచి పురవీధుల గుండా రైల్వే స్టేషన్‌ రహదారి గూడ్స్‌రోడ్డులోని ఇంద్రద్యుమ్న హాలు వరకు రథయాత్ర సాగింది.

ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అథ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఇంద్రద్యుమ్న హాలులో స్వామికి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రథోత్సవంలో స్వామివారి రథానికి ముందు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 16న రథోత్సవంలో భాగంగా తిరుగు రథయాత్ర ఉంటుందని, అదే రోజు మధ్యాహ్నం భారీ అన్నసమారాధన నిర్వహించనున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు.

ఉత్సవంలో భాగంగా స్వామివారు 8న కూర్మావతారం, 9న వరాహావతారం, 10 నారసింహావతారం, 11న వామనావతారం, 12న పరశురామావతారం, 13న రామావతారం, 14న కృష్ణావతారం, 15న బుద్ధావతారం, 16న కల్కి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారని వెల్లడించారు.