News

తిరుమలలో దళారులపై నిఘా

113views

తిరుమలలో తిష్టవేసిన దళారులపై అధికారులు దృష్టిసారించారు. నూతన ఈవో జె శ్యామలరావు ఆదేశాలతో దర్శన టికెట్లు, గదులను అధిక ధరలకు విక్రయించే వారిపై సీవీఎస్వి నరసింహకిశోర్, డీఎస్పీ శ్రీనివాసాచారి అధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. తితిదే ఐటీ విభాగం ద్వారా భారీగా గదులు పొందిన వారిని, ఇతర అక్రమాలకు పాల్పడిన వారిపై నిఘాను మరింత తీవ్రం చేశారు. ఈ మేరకు గత కొన్ని రోజులుగా అటువంటి దళారులను గుర్తించి చర్యలకు ఉపక్రమించారు.

తితిదే విజిలెన్స్ వింగ్ నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు తిరుమల పోలీస్ సబ్డివిజన్ పరిధిలో 2019 నుంచి 2024 తేదీ వరకు 279 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో 589 మంది నిందితులు ఉండగా 208 మందిని అరెస్టు చేశారు. మిగిలిన 337 మందికి 11 సీఆర్పేసీ నోటీసులను జారీచేశారు. మరో పదిమందికి జారీచేయాల్సి ఉందని, మరో పదిమంది నింతులను గుర్తించాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. ప్రధానంగా సీఆర్వో, ఎంబీసీ 34, వైకుంఠం-1, 2 వద్ద తిరిగే దళారులపై దృష్టి కేంద్రీకరించారు. జూన్ నుంచి ఈనెల 6 వరకు 12 కేసులు నమోదు చేయగా 11 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేశారు. శ్రీవారి సుప్రభాతం టిక్కెట్లను నకిలీ ఆధార్ కార్డుతో పొందిన నిందితులను, సీఆర్వో వద్ద నకిలీ ఆధార్ తో రూ.50 గదులను పొంది రూ.1000లకు విక్రయిస్తున్న నవకిషోర్ అనే దళారీని అరెస్టు చేశారు.

తిరుమలలో దశారీవ్యవస్థను నిర్మూలించడమే లక్ష్యంగా పోలీసుశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దర్శన టికెట్లు, గదులను అధిక ధరలకు విక్రయిస్తున్న వారిని జైలుకు పంపాం. ఎవరినీ ఉపేక్షించం. దళారుల సమాచారాన్ని అందించాలని భక్తులకు అవగాహన కల్పిస్తున్నాం. విజిలెన్స్ టోల్ ఫ్రీ 18004254141 సద్వినియోగం చేసుకోవాలి.-కె. శ్రీనివాసాచారి, డీఎస్సీ, తిరుమల సబ్ డివిజన్