
కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వా మి ఆలయానికి నిరంతరం భక్తుల రద్దీ ఉంటుంది. అయితే డిప్యూటీ కమిషనర్ తీసుకున్న నిర్ణయాలు భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. ఆయన తీరుపై గ్రామస్తులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. దేవదాయ ధర్మదాయశాఖ ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోయినా డిప్యూటీ కమిషనర్ భూపతిరాజు కిషోర్ కుమార్ భక్తుల రాకపోకలకు ఆటంకంకలిగిస్తూ ఆలయ ఉత్తర, దక్షణ ద్వారాలను మూసివేశారు. దీంతో స్వామివారి దర్శనానికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో భక్తులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉత్తర, దక్షణ ద్వారాలను తిరిగి తెరిపించారు. ఈ ఆలయానికి ప్రతి శనివారం రాష్ట్రం నలుమూలల నుంచి వేలా ది మంది భక్తులు తరలివస్తారు. భక్తులు మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్న డిప్యూటీ కమిషనర్ హోదాలో ఈఓ ఆయిన భూపతిరాజు కిషోర్ కుమార్ శైలిపై రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ కమిషనర్, ఆర్జేసీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదు చేసినట్లు భక్తులు, గ్రామస్తులు తెలిపారు. దీనిపై డీసీ కిషోర్ కుమార్ రాజును వివరణ కోరగా భక్తుల తాకిడి పెద్దగా ఉండదని, కొత్తగా నిర్మాణం చేసిన మండపం కావడంతో కేవలం ట్రయల్ రన్ మాత్రమే చేయడం జరిగిందన్నారు. భక్తులకు స్వామి వారి దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.





