
బ్రహ్మోత్సవాలకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ముస్తాబవుతుంది. ఏప్రిల్ 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనుండగా మరుసటి రోజు(ఏప్రిల్ 13)న పసుపు దంచే కార్యక్రమం నిర్వహిస్తారు.
ఏప్రిల్ 17 నుంచి 25వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో శుక్రవారం తిరుమంజనం నిర్వహించనున్నారు. శుక్రవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామిని మేల్కొలుపుతారు. అనంతరం ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఆలయంలో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ, సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమంతో ప్రోక్షణం చేస్తారు.
శ్రీ సీతారాముల కళ్యాణానికి సంబంధించి శనివారం ఉదయం పసుపు దంచే కార్యక్రమం చేపట్టనున్నారు. ఏప్రిల్ 22న అత్యంత వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో ఈ పసుపును వినియోగిస్తారు.





