News

మావోలు మూసివేసిన రామాలయాన్ని తెరిచి .. 21 ఏళ్ల తర్వాత పూజలు చేసిన జవాన్లు

263views

500 ఏళ్ల తర్వాత రామ జన్మ భూమి అయోధ్యలో రామాలయం నిర్మాణం జరుపుకుంది. రామాలయ ప్రారంభోత్సం అత్యంత ఘనంగాజరుపుకుంది. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో రామయ్య దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. మరోవైపు గత 21 ఏళ్లుగా మూతబడి ఉన్న రామాలయం తెరచుకుంది. ఆర్మీ జవాన్లు దేవదూతలుగా మారి ఆలయం తెరపించారంటూ గ్రామస్థులు సంబరాలు జరుపుకుంటారు. ఛత్తీస్‌గఢ్‌ సుఖ్మా జిల్లాలో 21 ఏళ్ల తర్వాత ఓ రాముడి గుడి తెరుచుకుంది. ఇంతకీ.. ఆ రామాలయం ఎందుకు మూతపడింది?.. ఇప్పుడెలా ఓపెన్‌ అయింది?.. ఈ రోజు తెలుసుకుందాం..

ఛత్తీస్​గఢ్ రాష్ట్రమంటేనే మావోయిస్టులకు అడ్డా.. అందులోనూ సుక్మా జిల్లా కారిడార్‌.. మావోయిస్టుల కేరాఫ్‌ అడ్రస్‌. ఇలాంటి సుక్మా జిల్లాలోని లఖాపాల్​​, కేరళపెండా గ్రామాల సమీపంలో 1970లో బిహారీ మహారాజు ఓ రామాలయాన్ని నిర్మించారు. అయితే.. తమ కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయనే కారణంతో ఆ గుడిలో పూజలు చేయకూడదంటూ 2003లో మావోయిస్టులు మూసివేశారు. మావోయిస్టుల బెదిరింపులతో అప్పటినుంచి 21 ఏళ్లుగా ఏ ఒక్కరూ రాముడి గుడి తలుపులు తెరిచేందుకు సాహసించలేదు. ఇలాంటి సమయంలో సీఆర్​పీఎఫ్​ 74వ బెటాలియన్​ కోసం కేరళపెండా సమీపంలో గతేడాది మార్చిలో లఖాపాల్​ క్యాంప్​ ఏర్పాటు చేశారు అధికారులు. ఈ క్రమంలో.. గ్రామంలోని పురాతనమైన రామాలయం గురించి సీఆర్​పీఎఫ్​ సిబ్బందికి తెలియజేశారు గ్రామస్థులు. విషయం తెలుసుకున్న సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు.. ఎలాగైనా ఆలయాన్ని తిరిగి తెరిపించి పూజలు జరుపుకునేలా చర్యలు తీసుకోవాలనుకున్నారు. దాని ద్వారా మారుమూల ప్రాంతంలో ఉన్న గ్రామ ప్రజలు జనజీవన స్రవంతిలో కలుస్తారని భావించారు.

ఎట్టకేలకు.. తాళం వేసి ఉన్న రామ మందిరం తలుపులను తెరిచి ఆలయ పరిసరాలను స్వయంగా శుభ్రపరిచారు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు. ఆ తర్వాత.. ఆ గ్రామ ప్రజల సాయంతో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి.. ఆలయాన్ని గ్రామ పెద్దలకు అప్పగించారు. అంతేకాదు… మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంలోని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు. ఈ క్రమంలోనే.. ఆలయ సమీపంలోనున్న మావోయిస్టుల స్థూపాన్ని కూడా సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు కూల్చివేశారు.