
శ్రారీమనవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే సీతారాముల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది.
ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్ఆర్టీసీ ఇంటివద్దకు చేరుస్తుంది. హైదరాబాద్లోని బస్ భవన్లో సోమవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు. తలంబ్రాల బుకింగ్ను ప్రారంభించారు.
“నియమ నిష్ఠలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా రాములోరి కళ్యాణంలో ఉపయోగిస్తున్నారు. విశిష్టమైన ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని రెండేళ్ల క్రితమే టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ ప్రయత్నానికి భక్తుల నుంచి మంచి స్పందన వచ్చింది” అని సజ్జనార్ తెలిపారు.
భద్రాద్రిలో ఈ నెల 17న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని చెప్పారు. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని తెలిపారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లైన 040-23450033, 040-69440000, 040-69440069 ను సంప్రదించాలని సజ్జనార్ సూచించారు.