
మార్చి 28, గురువారం ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లో ఒక ఘర్వాపసీ తరహా వివాహం జరిగింది. 20ఏళ్ళ ముస్లిం యువతి హీనా అలీ సనాతన ధర్మంలోకి మారి, తన ప్రియుడైన హిందూయువకుడు మహేష్ మౌర్యను పెళ్ళి చేసుకుంది. కొద్దిరోజుల క్రితం బదౌన్లో ఇద్దరు హిందూ చిన్నారులను ముస్లిం యువకుడు హతమార్చిన ఘటనతో ఆందోళన చెంది, వీలైనంత త్వరగా ఇస్లాంను వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పింది.
హీనా అలీ సీతాపూర్లోని ఖైరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తుండేది. ఆమె తండ్రి తాహిర్ అలీ ఆ ప్రాంతంలో క్షౌరశాల నిర్వహిస్తున్నాడు. ఇస్లాంను వదిలిపెట్టేయాలని నిర్ణయించుకున్న హీనా, బదౌనమ్ ఘటనలో మరణించిన పిల్లల తల్లి సంగీత పేరును తనకు పెట్టుకుంది. అనంతరం హిందూ సంప్రదాయిక పద్ధతిలో మహేష్ను పెళ్ళాడింది.
సంగీతగా మారిన హీనా చెప్పిన వివరాల ప్రకారం, మహేష్కు ఆమెకు మధ్య రెండున్నరేళ్ళ క్రితం ప్రేమ చిగురించింది. ఆమె కుటుంబం, ప్రత్యేకించి ఆమె తండ్రి తాహిర్ అలీ వారి బంధాన్ని ఒప్పుకోలేదు. మతద్రోహులైన హిందువులతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకూడదంటూ ఆమెను అడ్డుకున్నాడు. మరోవైపు మహేష్ కుటుంబం మాత్రం వారి ప్రేమకు ఆమోదముద్ర వేసింది. హీనాను తమ ఇంటి కోడలిని చేసుకుంటామంటూ మనస్ఫూర్తిగా ఆహ్వానించింది.
గురువారం నాడు సీతాపూర్ నగరంలో, కాన్షీరాం కాలనీలోని మాతా కాళీ ఆలయంలో హీనా, మహేష్ వివాహం జరిగింది. ముందు హీనా సనాతన ధర్మంలోకి చేరి, తనపేరును సంగీతగా మార్చుకుంది. అనంతరం వేదమంత్రాలు, జై శ్రీరామ్ నినాదాల మధ్య వారి వివాహ క్రతువు నిర్విఘ్నంగా సాగింది. మహేష్ కుటుంబంతో పాటు, స్థానిక హిందూ సంస్థలు కొత్త దంపతులను ఆశీర్వదించాయి. తమ రక్షణ గురించి ఆందోళన చెందిన సంగీత-మహేష్ జంట పోలీసుల రక్షణ కోసం అభ్యర్ధించారు.
రెండున్నరేళ్ళుగా ప్రేమలో ఉన్నా, ఇప్పుడు వెంటనే పెళ్ళి చేసుకోడానికి కారణాన్ని హీనా వెల్లడించింది. బదౌన్లో కొద్దిరోజుల క్రితం ఇద్దరు హిందూ చిన్నారి బాలురను ముస్లిం యువకులు దారుణంగా హత్య చేసారు. ఆ ఘటన తనను కదిలించివేసిందని, దాంతోనే హిందూమతంలోకి మారాలని నిర్ణయించుకున్నాననీ హీనా చెప్పింది. ఆ ఘటనలో నిందితులు కూడా తన తండ్రిలాగే క్షౌరశాల నడుపుతుండడం, తన నిర్ణయాన్ని మరింత వేగవంతం చేసిందని హీనా ఒక వీడియో ప్రకటనలో చెప్పింది.
‘హిందూ షేర్ సేన’ అధ్యక్షుడు వికాస్ హిందూ ఈ పెళ్ళి జరిపించారు. ఆయన హీనా ధైర్యాన్ని అభినందించారు. కుటుంబపరమైన, మతపరమైన ఒత్తిడులను హీనా ఎదుర్కొన్న తీరును కొనియాడారు. కొత్తజంటకు తమ సంస్థ అండగా నిలుస్తుందని చెప్పారు.





