
బ్రహ్మోత్సవాలకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ముస్తాబు అవుతోంది. ఏప్రిల్ 17 నుంచి 25 వరకు అంబరాన్ని అంటేలా బ్రహ్మోత్సవాల సంబరాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏప్రిల్ 22న సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు శ్రీ సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం చెప్పారు. ఏప్రిల్ 16న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుండగా, ఏప్రిల్ 20న హనుమంత వాహనంపై నుంచి స్వామివారు అభయమిస్తారు. ఏప్రిల్ 21న గరుడవాహన సేవ, ఏప్రిల్ 22న సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 23న రథోత్సవం, ఏప్రిల్ 25న చక్రస్నానం, ఏప్రిల్ 26న పుష్పయాగం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, ఇతర అధికారులతో ఒంటిమిట్టలో జేఈవో సమీక్ష నిర్వహించారు.





