News

దటీజ్ భారత్‌ నేవీ.. 40 గంటల రెస్క్యూ ఆపరేషన్‌ సక్సెస్‌

238views

భారత నావికాదళం మరోసారి సత్తా చాటింది. అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైన నౌకలో ఉన్న 17 మందిని ఎంతో సాహసోపేతంగా కాపాడింది. సుమారు 40 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్‌ జరిపి నౌకలో ఉన్న 35 మంది సముద్రపు దొంగలను పట్టుకుంది.

వివరాల ప్రకారం.. గతేడాది డిసెంబర్ 14న అరేబియా సముద్రంలో ఎంవీ రుయెన్ నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. సముద్రంలో దోపిడీకి ఈ నౌకను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నౌనకు రక్షించేందుకు భారత నేవీ రంగంలోకి దిగింది. నౌక రక్షణ కోసం ఆపరేషన్‌ చేపట్టింది. సుమారు 40 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి నౌకను రక్షించారు.

ఈ ఆపరేషన్‌లో మొత్తం 35 మంది సముద్రపు దొంగలు లొంగిపోగా.. నౌకలోని 17 మంది సిబ్బంది సురక్షింతంగా ఉన్నట్టు నేవీ అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఐఎన్ఎస్ కోల్‌కత్తా, యుద్ధనౌక ఐఎన్ఎస్ సుభద్ర, ఆధునిక డ్రోన్లు, P8I పెట్రోలింగ్ విమానాలు ఉపయోగించినట్టు ఇండియన్ నేవీ తెలిపింది. హైజాక్‌కు గురైన ఎంవీ రుయెన్‌ పూర్తిగా భారత నావికాదళం ఆధీనంలో ఉన్నట్టు పేర్కొంది.

ఇదిలా ఉండగా.. ఈ నెల 15వ తేదీన భారత నేవీ ఆపరేషన్ చేపట్టే ముందు సముద్రపు దొంగలను లొంగిపోవాలని సూచించింది. లేకపోతే వారిపై దాడులు ప్రారంభించాలని మెరైన్ కమాండోలకు నేవీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమాలియా సముద్రపు దొంగలు నేవీ అధికారులపై కాల్పులు జరిపారు. అనంతరం ఏ మాత్రం బెదరకుండా రెస్క్యూ కొనసాగించిన నేవీ సముద్రపు దొంగలు లొంగి పోయేలా చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను కూడా ఇండియన్ నేవీ రిలీజ్ చేసింది.

ఇక,అంతకుముందు బంగ్లాదేశ్‌కు చెందిన ఓ నౌకను సైతం ఇండియన్ నేవీ రక్షించింది. భారత నావికాదళం అరేబియా సముద్రంలో జరిగిన సంఘటనలను తక్షణమే పరిష్కరించడం, వాణిజ్య నౌకలను రక్షించడానికి అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తోంది. దీంతో, భారత నావికాదళంపై ప్రపంచదేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి.