
261views
పాకిస్థాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ), పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్)ల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ప్రధానిగా పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడిగా పీపీపీ కో ఛైర్మన్ ఆసిఫ్ జర్దారీ బాధ్యతలు చేపడతారని మంగళవారం అర్థరాత్రి సంయుక్త వార్తా సమావేశంలో పీపీపీ, పీఎంఎల్ఎన్ నేతలు ప్రకటించినట్లు జియో న్యూస్ పేర్కొంది. పాక్ ప్రధానిగా మరోసారి షెహబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపడతారని పీపీపీ ఛైర్మన్ బిలావల్ భుట్టో తెలిపినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. దీంతో పదవుల పంపిణీ విషయమై కొద్ది రోజుల నుంచి జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చినట్లయ్యింది.





