
( ఫిబ్రవరి 9 – పురందరదాసు ఆరాధనోత్సవం )
కర్ణాటక పదకవితా పితామహుండని పేరు పొందాడు. కన్నడ భాషలో రాసిన వారి పదాలు ప్రజల నాలుకల పై నాట్య మాడుతుంటాయి.ప్రజల భాషలు ఆడిపాడుకోవడానికి వీలుగా సరళంగా సుబోధకంగా ఉండే పదాలు చెప్పిన ప్రజాకవి. సంసార భవబంధాలు అనే సముద్రాన్ని దాటడానికి విఠలుని శరణు వేడటమే మార్గం అనుకున్నాడు భక్తాగ్రేసరుడు పురందరుడు. తంబూర మీటుతూ ఎన్నో గేయాలను రచించిన వాగ్గేయకారుడాయన. స్వానుభవాలతో కూడిన ఆ కీర్తనలు వేదాంత ప్రబోధకాలై అలరించాయి.తన మధురమైన కంఠంతో వాటిని గానం చేసిన ప్రముఖ గాయకుడు. ఆయనకు వాగ్గేయకారులలో అత్యున్నత స్థానాన్ని ఇచ్చారు.
పుణే సమీపంలో 1470లో జన్మించిన పురందర దాసు అసలు పేరు శ్రీనివాసుడు. తండ్రి వరదప్ప. ఆయన వజ్రాల వ్యాపారి. తల్లిదండ్రులు వేంకటేశ్వర స్వామి భక్తులు. భగవదనుగ్రహం ముందు సిరి సంపదల్ని గడ్డిపరకతో సమానమని గ్రహించి ఆస్తినంతటినీ దానం చేసిన ‘నవకోటి నారాయణ్’ బిరుదువహించిన శ్రీనివాస నాయకుడు వ్యాసరాయలు శిష్యుడు పురందర విఠలునిపై లక్షలాది పదాలు రచించి పురందరదాసు గా పేరుగాంచాడు. పురందర విఠల అనే మకుటం (కన్నడలో ముద్ర అంటారు)తో పద రచన ఉంటుంది. కర్ణాటక ప్రాంతంలో వైష్ణవ మత వ్యాప్తి, కృషిచేసినవాడు.
పురందరదాసు 30 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు సంకీర్తనాచార్యుడైన అన్నమాచార్యుని కలుసుకొన్నట్లు ఆధారాలు లభిస్తున్నాయి. వ్యాసరాయలు పుండ్ర దాసునకు జ్ఞానధ్యానాలు, జపతపాలు, మంత్ర తంత్రాలు ఉపదేశించాడు. పురందరదాసు భక్తి వైరాగ్యం వివరిస్తూ నాలుగు లక్షల డెబ్బై అయిదు వేల పదాలు రచించాడు.కర్ణాటక సంగీత సాధనకు పురందర దాసు అనేక శాస్త్రీయ పద్ధతులు కనుగొన్నారు. ఏన్నొ ఏళ్ళు గడిచినా, ఈ నాటికి అవే పద్ధతులను సంగీత భొధనకు ఉపయోగించడం ఒక విశేషం. కర్ణాటక సంగీతంలో ప్రధానమైన “రాగ మాయమాళవగౌళ” పద్ధతిని అవిష్కరించారు.ఇతర బోధనా పద్ధతులైన స్వరావళులు, జంట స్వరాలు, అలంకారాలు, లక్షణ గీతాలు, ప్రబంధాలు, యుగభోఘలు, దాటు వరసలు,గీతాలు, సూలదిలు, కృతులు వంటి ఆంశాలు కనుగొన్నారు. సాధారణ మానవులు కూడా అనువుగా పాడుకొనుటకు అనువైన జానపదాలను కూడా రచించారు. పురందర దాసు ఒక వాగ్గేయకారుడు, సంగీత అధ్యయన వేత్త, కృతి కర్త. అందుకే ఆయనని “కర్ణాటక సంగీత పితామహా” అని పిలుస్తారు.
వేదశాస్త్ర పురాణాల్లో విద్యావివేకాల్ని ప్రజా ప్రాభవాన్ని తన పదాలు పొందుపరిచాడు. ఈ పదాలకు పురందరో పనిషత్తు అనే ప్రఖ్యాతి కలిగింది. అందుకే వ్యాసరాయలు దాసరందరే పురందర దాసరయ్య అని శిష్యుణ్ణి మెచ్చుకున్నాడు. కృష్ణదేవరాయలు పురందరదాసు ని పురందరుని అపరావతారంగానే భావించి సత్కరించారు.
పురందర దాసు చిరుతలు, తంబూర, గజ్జెలు, ధరించి దాస వృత్తిలో వీధి వీధి తిరుగుతూ భక్తి తో పాటు జ్ఞానాన్ని, ఆచారాలపేర జరిగే అనాచారాన్ని ఖండిస్తూ నీతిని బోధించే పద్యాలు గానం చేసేవాడు. మానవుల జీవితాలనుద్ధరించిన భక్తాగ్రేసరుడు.భగవంతుడే అప్పణ్ణ వేషంలో వచ్చి పురందరదాసు సేవ చేశాడు. మహామహితాత్ముడైన పురందర దాసు ఎల్లప్పుడు అందరికీ వందనీయుడు, చరితార్థుడు.





