
314views
అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల చేరుకునే యాత్రికులకు ఉచిత బస్సు సదుపాయం కల్పించటానికి అనుమతివ్వాలంటూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) దాఖలు చేసిన పిటిషన్పై కేరళ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. దీనిపై స్పందన తెలియజేయాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశించింది. ఇదే తరహా పిటిషన్ను గత ఏడాది వీహెచ్పీ దాఖలు చేయగా కేరళ హైకోర్టు కొట్టివేయడంతో ఆ సంస్థ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. యాత్రికులకు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నడుపుతున్న బస్సులు సరిపోవడం లేదని, దీంతో వారు అధిక సమయం పాటు నిరీక్షించాల్సి వస్తోందని వీహెచ్పీ పేర్కొంది. అందువల్ల ఉచితంగా బస్సులు నడపటానికి అనుమతించాలని విజ్ఞప్తి చేసింది.





