
లక్నో విశ్వవిద్యాలయం (LU)కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ(MBA) కోర్సులో అయోధ్య ప్రాముఖ్యత, చరిత్రను పాఠంగా బోధించనుంది. రెండేళ్ళ ఎంబీఏ కోర్సులో భాగంగా నాలుగో సెమిస్టర్ లో ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ పేపర్ లో భాగంగా ఈ పాఠాన్ని విద్యార్థులకు బోధించనుంది.
అయోధ్య పరిణామక్రమానికి సంబంధించిన విషయాలను సిలబస్ లో పొందుపరుస్తారు. పురాతన నగరం నుంచి ఆధ్మాతిక పర్యాటక కేంద్రంగా అయోధ్య రూపాంతరం చెందిన తీరును విద్యార్థులకు వివరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లక్నో వర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఫ్రొఫెసర్ అలోక్ కుమార్ తెలిపారు.
అయోధ్య రామమందిర నిర్మాణంలో అనుసరించిన వివిధ ప్రక్రియలతోపాటు, తుదిరూపు అర్థం చేసుకునేందుకు ఇదో మంచి అవకాశమని అభిప్రాయపడ్డారు. అయోధ్యలో వచ్చిన మార్పులను భౌతికంగా అధ్యయనం చేసేందుకు విద్యార్థులకు ఇదో మంచి అవకాశమన్నారు.
ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయం, వారసత్వాల ఘనమైన గతంతో పాటు ఆధునిక భౌతిక ప్రపంచ ప్రభావాలు, దైవత్వం, విశ్వాసాల మేలు కలయికగా అయోధ్య రూపుదిద్దుకుందన్నారు.





