
ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ ఓ శాపంగా మారింది. భర్తలకు ఏ చిన్న కారణం దొరికినా, కోపానికి గురైనా ట్రిపుల్ తలాక్ చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో తోచక మహిళలు పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. కూరగాయాలకు ముప్పయి రుపాయాలు ఇవ్వమన్నందుకు భార్యపై కోపగించుకోవడమే కాకుండా ఆమెను చావబాది ట్రిపుల్ తలాక్ కూడా చెప్పేశాడో ప్రబుద్దుడు.
నోయిడాలో ఉంటున్న సబీర్, జైనబ్ లకు కొద్ది రోజుల క్రితమే వివాహం అయింది. అయితే వివాహానంతరం సబీర్ భార్యను వేధింపులకు గురి చేయడంతోపాటు హింసకు గురి చేశాడు. వేధింపులు తాళలేక పుట్టింటికి వెళ్ళిన జైనబ్ ఈ మధ్యనే తిరిగి వచ్చింది.
ఈ నేపధ్యంలో ఇంట్లోకి కూరగాయలు తెచ్చేందుకు భర్త సబీర్ను ముప్పై రుపాయాలు అడిగింది జైనబ్. దీంతో ఆగ్రహించిన సబీర్ నన్నే డబ్బులడుగుతావా? అంటూ భార్యపై స్క్రూడ్రైవర్తో దాడి చేయడంతోపాటు విద్యుత్ షాక్ కూడా పెట్టాడు. ఆ వెంటనే ట్రిపుల్ తలాక్ కూడా చెప్పాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు వెంటనే కూతురు వద్దకు వెళ్లారు. గాయాలతో ఉన్న జైనబ్ను చూసి లబోదిబోమన్నారు. అనంతరం తమ కూతురుని తమ అల్లుడు చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్త,మామా, ఆడబిడ్డలపై కూడా జైనబ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు సబీర్ ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ఇతర కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నట్టు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ నీరజ్ మాలిక్ తెలిపారు.





