
భారత్ పై విషం చిమ్మడమే లక్ష్యంగా చైనా నుంచి పుట్టుకొస్తున్న నకిలీ ఫేస్ బుక్ ఖాతాల ముప్పును టెక్ దిగ్గజం మెటా తాజాగా వెలుగులోకి తీసుకొచ్చింది.
మన దేశంపై తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా అవి పని చేస్తున్నట్లు వెల్లడించింది. తద్వారా ప్రజాభిప్రాయాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది. అందుకోసం అధునాతన వ్యూహాలను అనుసరిస్తున్నట్లు తెలిపింది.
మంగళవారం విడుదల చేసిన ఓ త్రైమాసిక నివేదికలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. చైనా నుంచి పుట్టుకొస్తున్న అనేక నకిలీ ఖాతాలను గుర్తించి రద్దు చేసినట్లు మెటా వెల్లడించింది. భారతీయులుగా నటిస్తూ.. దేశ రాజకీయాలు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై తప్పుదారి పట్టించే సమాచా రాన్ని వ్యాప్తి చేయడంలో ఈ ఖాతాలు చురుకుగా వ్యవ హరిస్తున్నాయని వివరించింది.
పాత్రికేయులు, న్యాయ వాదులు, మానవ హక్కుల కార్యకర్తలుగా చెబుతూ ఈ నకిలీ ఖాతాలను చైనా నుంచి నిర్వహిస్తున్నారని తెలిపింది. ఎక్కువగా ఆంగ్లంలో పోస్టులు పెడుతున్నారని.. అప్పుడప్పుడూ హిందీ, చైనీస్ భాషలను ఉపయోగించినట్లు మెటా వెల్లడించింది. స్థానిక వార్తలు, సంస్కృతి, క్రీడలు, టిబెట్, అరుణాచల్ ప్రదేశ్ కు సంబంధించిన అంశాలపైనా పోస్టులు పెడుతున్నారని పేర్కొంది.





