ArticlesNews

భారతదేశంలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు దేనికి?

347views

జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఇటీవలి చర్యల పట్ల వామపక్షీయులు,జిహాదీలు చాలా కోపంగా ఉన్నారు. గండేర్‌బల్ జిల్లా షేర్-ఎ-కశ్మీర్ వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి విశ్వవిద్యాలయంలో ఏడుగురు కశ్మీరీ విద్యార్ధుల మీద రాష్ట్ర పోలీసులు ఉపా, మరికొన్ని చట్టాల ప్రకారం కేసులు పెట్టి అరెస్టు చేసారు. వారిమీద ఆరోపణ ఏంటంటే, నవంబర్ 19న క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయిన సందర్భంలో వారు వేడుక చేసుకున్నారు. టపాకాయలు కాల్చారు, పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసారు. అంతేకాదు, కశ్మీరేతర విద్యార్ధి ఒకరు వారి చర్యలను వ్యతిరేకించగా, భారతదేశాన్ని సమర్థిస్తే ప్రాణాలు తీసేస్తామని బెదిరించారు కూడా.

ఏ ఆటలోనైనా తనకు నచ్చిన టీమ్‌కి మద్దతివ్వడం, వారి మనోబలం పెరిగేలా వ్యవహరించడం మామూలే. అహ్మదాబాద్‌లో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు అనుకూలంగా నినాదాలు చేయడాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ కొందరు కశ్మీరీ కుర్రాళ్ళు పాకిస్తాన్‌ను సమర్ధిస్తూ నినాదాలు చేయడం, క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా భారతదేశానికి వ్యతిరేకంగా విషం కక్కడం గమనించాల్సిన విషయం.

అసలు నవంబర్ 19 రాత్రి విశ్వవిద్యాలయంలో ఏం జరిగింది? ఓ ఇంగ్లీషు పత్రికకు ఇచ్చిన ముఖాముఖిలో విశ్వవిద్యాలయం పదాధికారి ఇలా చెప్పారు, ‘‘హాస్టల్లో సుమారు 300 మంది విద్యార్ధులున్నారు. వారిలో ఓ 30-40 విద్యార్ధులు పంజాబ్, హరియాణా, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు చెందినవారున్నారు. నవంబర్ 10 రాత్రిమ్యాచ్ అయిపోయాక గొడవ అయింది. భారత్ ఓటమి తర్వాత బాణాసంచా కాల్చి తమను ఇబ్బంది పెట్టారంటూ కశ్మీరేతర విద్యార్ధులు ఆరోపించారు. ఏడుగురు విద్యార్ధులకు వ్యతిరేకంగా 20ఏళ్ళ వయసున్న ఒక బాధిత విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదులో ‘‘మ్యాచ్ తర్వాత వాళ్ళు నన్ను సతాయించడం మొదలుపెట్టారు. నన్ను బూతులు తిట్టారు. ఎందుకంటే నేను నా దేశాన్ని సమర్థిస్తూ వచ్చాను. వాళ్ళు నన్ను తుపాకితో కాల్చి చంపేస్తామని బెదిరించారు. పాకిస్తాన్‌కి అనుకూలంగా నినాదాలు మొదలుపెట్టారు. దాంతో మాలాంటి విద్యార్థులకు చాలా భయమేసింది’’ అని చెప్పాడు. ఈ కేసులో ఆ ఏడుగురు నిందితుల పేర్లూ…. తౌకీర్ భట్, మొహసిన్ ఫారూఖ్ వానీ, ఆసిఫ్ గుల్జార్ వార్, ఉమర్ నజీర్ డార్, సయ్యద్ ఖాలిద్ బుఖారీ, సమీర్ రషీద్ మీర్, ఉబేర్ అహ్మద్.

ఆ విద్యార్ధులు ఎవరికి అనుకూలంగా నినాదాలు చేసారో ఆ పాకిస్తాన్ ఒక విఫల ఇస్లామిక్ దేశం. అక్కడ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పాత బాకీలు తీర్చకుండానే మిత్రదేశాల దగ్గర అప్పులు సంపాదించడం కోసం నానా అవస్థలూ పడుతోంది పాక్ ప్రభుత్వం. ఆ ముస్లిం దేశం పరిస్థితి ఏంటంటే ప్రపంచబ్యాంకు ఆ దేశంలోని 40శాతం జనాభా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారని వెల్లడించింది. నిజమేంటంటే పాకిస్తాన్ ఒక దేశమే కాదు, అదొక చెత్త ఆలోచన అంతే. ’’భారతదేశాన్ని వెయ్యిసార్లు గాయపరిచైనా నాశనం చేయాల్సిందే’’ అన్నదే వారి అధికారిక విధానం. ఇస్లామేతర సంస్కృతులు, సంప్రదాయాలు, పరంపరలను మతం అన్న ఒకే ఒక్క కారణంతో తిరస్కరించడమే పాకిస్తాన్ పద్ధతి. ముస్లిముల జిహాదీ ఆలోచనా ధోరణి ప్రకారం భారత ఉపఖండంలోని హిందువులు, బౌద్ధులు, సిక్కులు తదితరులందరూ వారి పూజా పద్ధతుల కారణం చేత కాఫిర్‌లు, కాబట్టి వారిని చంపేయాలి. లేదా వారిని మతం మార్చివేయాలి. ఆ కారణం చేతనే హిందువుల వేలాది పూజాస్థలాలను ధ్వంసం చేసారు. కాలాంతరంలో అదే ఆలోచనాధోరణి వామపక్షీయుల సహకారంతో భారతదేశాన్ని రక్తసిక్తం చేసి విభజించింది. అంతేకాదు, ఎన్నో దశాబ్దాలుగా భారతదేశాన్ని ముక్కలు చెక్కలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అందుకే నేటికీ భారతీయ పాస్‌పోర్ట్ ఉన్నప్పటికీ చాలామంది గుండెలు పాకిస్తాన్‌ కోసం కొట్టుకుంటూ ఉంటాయి.

ఈ ముప్పు ‘ద్విజాతి సిద్ధాంతం’ నుంచి వచ్చింది. దాన్ని ప్రతిపాదించినది 1880 దశకంలో సయ్యద్ అహ్మద్ ఖాన్. కాలక్రమంలో ఆ సిద్ధాంతాన్ని ముస్లింలీగ్, మహమ్మద్ అలీ జిన్నా, మహమ్మద్ ఇక్బాల్, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్ధులు సాకారం చేసారు. ఆ సమయంలో దేశంలో 95శాతం ముస్లిములు పాకిస్తాన్ గురించి ఆందోళన చెందుతున్నారు. అయినప్పటికీ దేశ విభజన తర్వాత వారిలో అత్యధికులు భారత్ వదిలి వెళ్ళలేదు. వారిలో చాలామంది కాంగ్రెస్‌తో కలిసిపోయారు. చిత్రమేంటంటే దేశ విభజనకు ముందు అదే కాంగ్రెస్‌ని వారు హిందువుల కూటమి అని నిరాకరించారు.

ఈ విషయంలో స్వతంత్ర భారతదేశపు మొదటి హోంమంత్రి, ఉపప్రధానమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 1948 జనవరి 3న కోల్‌కతాలో చెప్పిన విషయం చాలా ముఖ్యమైనది. ‘‘….హిందుస్తాన్‌లో ఉన్న ముస్లిములలో చాలామంది, దాదాపు అందరూ, పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడవలసిందేనంటూ దానికి సహకరించారు. సరే, కానీ ఇప్పుడు ఒకే ఒక్క రోజులో, ఒకే ఒక్క రాత్రిలో వారి మనసులు మారిపోయాయి. అదే నాకు అర్ధమవడం లేదు. ఇప్పుడు వాళ్ళు తాము విశ్వాసపాత్రులమనీ, తమ విధేయతను ఎందుకు అనుమానిస్తున్నారనీ అడుగుతున్నారు. మీ హృదయాలను అడగండి. ఈ విషయం మీరు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు?….’’’ సర్దార్ పటేల్ ఆ మాటలు చెప్పిన 76ఏళ్ళ తర్వాత కూడా అదే విశ్లేషణ వర్తమాన పరిస్థితుల్లో నేటికీ ఏమాత్రం మార్పు లేకుండా ఉండడం ఎంతో బాధాకరమైన విషయం.

వామపక్షీయులతో పాటు జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ కూడా పాకిస్తాన్ ప్రేమికులే. ఈ విద్యార్ధులపై పోలీసులు చర్య తీసుకోడాన్ని వారిద్దరూ నిందించారు. నిజానికి వారి చిరపరిచితమైన రాజకీయ విధానం అదే. దానికి నాంది 1931లోనే పడింది. షేక్ అబ్దుల్లా, అతని సన్నిహిత మిత్రుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మధ్య ప్రత్యక్ష-పరోక్ష పరస్పర సహకారమే ఆ పద్ధతికి బీజారోపణం చేసింది. అప్పట్లో ‘కాఫిర్’ అయిన మహారాజా హరిసింగ్‌కు వ్యతిరేకంగా జిహాద్ చేయాలని కూడా భావించారు. కాలక్రమంలో ఇస్లాం పేరు మీద వేలాది హిందువులను చంపేసారు, వారిని మతం మార్చారు, వారి దుకాణాలు తగలబెట్టేసారు, వారి ఆస్తులు కొల్లగొట్టారు, హిందూ మహిళలను లైంగికంగా వేధించారు. హిందువులు-సిక్కుల పవిత్ర మతగ్రంథాలను అవమానించారు. హిందూ దేవీదేవతల విగ్రహాలను ధ్వంసం చేసారు. పండిట్ నెహ్రూ భ్రమలు 1953లో తొలగాయి. అప్పుడు షేక్‌ అబ్దుల్లాను అరెస్ట్ చేసారు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఆ పరిస్థితి మళ్ళీ ఇందిరాగాంధీ హయాంలో మారిపోయింది. 1974-75 సంవత్సరంలో ఇందిరా గాంధీ – షేక్ అబ్దుల్లా మధ్య ఒప్పందంతో, అంతకుముందు చేసుకున్న ఒప్పందం రద్దయిపోయింది. దాని తర్వాత 1980-90 దశకంలో మళ్ళీ జిహాదీ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఫలితంగా, లోయ ప్రాంతంలో హిందువులు అనేవారే లేకుండా పోయారు.

2019 ఆగస్టులో భారత రాజ్యాంగంలోని 370-35ఎ అధికరణాన్ని రద్దు చేసారు. ఆ తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు మళ్ళీ మొదలయ్యాయి. వాటితో పాటే సమీకృత ఆర్థికాభివృద్ధి, కేంద్ర పథకాల అమలులో వేగం, పర్యాటకుల సంఖ్యలో పెరుగుదల, మూడు దశాబ్దాల తర్వాత తెరుచుకున్న సినిమాహాళ్ళ సందడి, భారతీయ సినిమా పరిశ్రమకు కశ్మీర్‌తో మళ్ళీ అనుబంధం ఏర్పడడం, జి-20 వర్క్‌షాప్, అంతర్జాతీయ సమావేశం, ఉగ్రవాద కార్యకలాపాల తగ్గుదల వంటి ఎన్నో చారిత్రక ఘట్టాలు నమోదయ్యాయి. ఇంత మార్పు వచ్చిన తర్వాత కూడా… ఈ గడ్డ మీద నిలబడి, భారతదేశంలో నివసిస్తూ ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని నినాదాలు చేసేవారు ఇంకా ఉంటే, వారు నిర్మొహమాటంగా భారతదేశాన్ని వదిలిపెట్టి తమకు నచ్చిన దేశంలో నివసించడానికి పంపించేయాల్సిందే.

వ్యాసకర్త: బల్‌బీర్‌ పుంజ్, రాజ్యసభ మాజీ సభ్యులు, భాజపా మాజీ జాతీయ ఉపాధ్యక్షులు