
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల, తిరుపతిలోని పలు వేదికలపై టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
తిరుమలలోని ఆస్థానమండపంలో వేద సందేశం, శ్రీమతి ప్రసన్న లక్ష్మి బృందం విష్ణుసహస్రనామపారాయణం, శ్రీమతి వాగ్దేవి బృందం భక్తి సంగీతం, జి.అమరేశ్వరకుమార్ భక్తామృతం ధార్మికోపన్యాసం చేశారు. సా వి.కృష్ణ బృందం అన్నమయ్య విన్నపాలు, శ్రీమతి విజయకుమారి బృందం హరికథా పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు.
తిరుపతి రామచంద్ర పుష్కరిణి వేదికపై అన్నమాచార్య ప్రాజెక్టుకు చెందిన డా. పి.రమణవాణి ‘శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ…, తిరుమలగిరిరాయ…., నారాయణాచ్యుతానంద గోవింద హరి…., తిరు తిరు జవరాల తిత్తిత్తి…., హరి నీ ప్రతాపమునకడ్డమేది లోకమున…., అవధరించగదవయ్య ఇన్ని రసములు…, చందమామ రావో జాబిల్లి రావో… అన్నమాచార్య కీర్తనలను తమ మధురమైన కంఠంద్వారా వినిపించి సభను రంజింపజేశారు. వీరికి కీర్తన, సౌమ్య గాత్రసహకారమందించగా, కీబోర్డుపై కల్యాణ్ కుమార్, తబలాపై పి.పాండురంగ రావు సహకరించారు.
మహతి కళాక్షేత్రంలో మొదట హైదరాబాదుకు చెందిన ప్రఖ్యాత వేణుగాన విద్వాంసురాలు శ్రీమతి డా. జయప్రద రామమూర్తి తమ వేణుగాన కచేరితో భక్తాదులను మైమరపించారు. వీరు అన్మమాచార్యుల బ్రహ్మ కడినపాదము…, పలుకుతేనెలతల్లి పవళించెను…., జో అచ్యుతానంద… కీర్తనలను ఆలపించారు. వీరికి వయోలిన్ పై జి.చక్రపాణి, మృదంగంపై మురళీకృష్ణ, మోర్సింగ్ పై ప్రసాద్ సహకరించారు.
తదుపరి నూజివీడుకు చెందిన బి.విద్యాసాగర్ తమ భక్తిసంగీతంలో వందేహం జగద్వల్లభం…, రామచంద్రుడితడు…, లాంటి కీర్తనలను ఆలపించగా, వీరికి చంద్రమౌళి వయోలిన్ పై, మృదంగంపై మంగళగిరి శ్రీధర్ సహకరించారు.
అన్నమాచార్య కళామందిరంలో శ్రీమతి జనని హంసిని బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.





