News

మణిపూర్లో ఆగని హింస.. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

66views

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అల్లర్లతో అట్టుడికిపోతోంది. గిరిజనులు వర్సెస్ గిరిజనేతరుల ఆందోళనలతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. అల్లర్లు హింసాత్మకంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది. పరిస్థితి చేయి దాటితే ఆందోళనకారులపై కాల్పులు జరపొచ్చని భద్రతా బలగాలను ఆదేశించింది. మరోవైపు దాదాపు 500 మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలను మణిపూర్ కు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే రాష్ట్ర పోలీసులు, అస్సాం రైఫిల్స్‌, సీఆర్పీఎఫ్ సిబ్బందిని ఇంఫాల్‌లో మోహరించారు.

8 జిల్లాలో కర్ఫ్యూ

మణిపూర్లోని 8 జిల్లాలో ప్రస్తుతం భయానక పరిస్థితులు నెలకొన్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లోని ప్రజల్ని అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రదేశాలకు తరలించారు. రాజధాని ఇంఫాల్, చుర్‌ చంద్‌పూర్, కాంగ్‌ పోక్పి సహా పలు జిల్లాల్లో ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో మణిపూర్ ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. ఐదు రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులు నిలిపేసింది.

అసలేంటీ వివాదం

మణిపూర్‌లో గిరిజనేతరులైన మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పిస్తూ కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. ఇది కాస్తా ఆందోళనకు దారి తీసింది. కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మంగళవారం మణిపూర్ లోని గిరిజన సంఘాల నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ప్రార్థనా స్థలాలు, వాహనాలను తగలబెట్టారు. గురువారం నాటికి ఇంఫాల్‌, చురా చంద్‌పూర్‌, కంగ్‌పోక్కి ప్రాంతాల్లో హింస చెలరేగింది. మణిపూర్ జనాభాలో మైతీ సామాజిక వర్గం వారు 64 శాతం ఉన్నారు. ముఖ్యంగా ఇంఫాల్లో వీరి ప్రాబల్యం ఎక్కువ. ఈ క్రమంలో మైతీలను షెడ్యూల్డు తెగల జాబితాలో చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా గిరిజనులు కోర్టును ఆశ్రయించారు. అయితే న్యాయస్థానం సైతం మైతీలకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో గిరిజనులు ఆందోళనలు దిగారు.

ఎవరీ మైతీలు?

మైతీ తెగ ప్రజలు బ్రాహ్మణ వర్గానికి చెందినవారు. బెంగాలి మాట్లాడుతారు. వీరు ప్రధానంగా పూజ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. స్థానికంగా ఎస్టీ హోదా కలిగిన గిరిజనులు ఎక్కువగా క్రైస్తవ మతం ఆచరిస్తుంటారు. దీంతో మైతీలకు ఎస్టీ హోదా ఇవ్వటాన్ని గిరిజన తెగలు మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదిలా ఉంటే మయన్మార్, బంగ్లాదేశ్‌ నుంచి చట్టవిరుద్ధంగా పెద్ద ఎత్తున జనం మణిపూర్ లోకి వలస వస్తున్నారు. వీరి వల్ల తమకు సమస్యలు ఎదురవుతున్నాయని మైతీలు వాదిస్తున్నారు. తమకు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి ఇంఫాల్ లోని రాజకీయ నాయకులు సైతం మద్దతు ప్రకటిస్తున్నారు.