News

బజరంగ్ దళ్‌ను కాంగ్రెస్‌ నిషేధించదు…. అది సాధ్యం కాదు కూడా…. మాట మార్చిన వీరప్పమొయిలీ

62views

విశ్వహిందూ పరిషత్‌ యువ విభాగం బజరంగ్ దళ్‌.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరుణంలో వార్తల్లోకి ఎక్కింది. తాము అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్‌ను, పీఎఫ్‌ఐను నిషేధిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కాంగ్రెస్‌.

అయితే ఈ ప్రకటన చేసిన రెండు రోజులకే కాంగ్రెస్‌ స్వరం మార్చింది. అలాంటి ప్రతిపాదన ఆచరణకు వీలుపడదంటూ ఆ పార్టీ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ ప్రకటించారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ గురువారం ఉడిపిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. బజరంగ్‌ దళ్‌ నిషేధంపై ఆయన స్పందించారు. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు బజరంగ్‌ దళ్‌ గురించి మా మేనిఫెస్టోలో ప్రస్తావించాం. ఇది అన్ని రాడికల్‌ గ్రూప్‌లకు వర్తిస్తుందని చెప్పాం. కానీ, అలా నిషేధించడం ఒక రాష్ట్ర ప్రభుత్వంతో సాధ్యపడదని ఆయన పేర్కొన్నారు. కాబట్టి, కర్ణాటక ప్ఱభుత్వం బజరంగ్‌ దళ్‌ను బ్యాన్‌ చేయబోదని ఆయన స్పష్టం చేశారు.

”ఈ విషయంపై కర్ణాటక బీజేపీ చీఫ్‌ డీకే శివకుమార్‌ మీకు (మీడియాను ఉద్దేశించి..) మరింత స్పష్టత ఇస్తారు. చివరకు సుప్రీం కోర్టు కూడా విద్వేష రాజకీయాలకు ముగింపు ఉండాలని తన తీర్పులో అభిప్రాయపడింది. కాబట్టి.. అలాంటి ప్రతిపాదనేం మేం చేయట్లేదు. కాంగ్రెస్‌ నేతగా ఈ విషయాన్నే మీకు స్పష్టం చేయదల్చుకున్నా” అని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ విడుదల చేసిన మేనిఫెస్టోలో నిషేధం గురించి స్పష్టమైన వివరణ ఉంది. మైనారిటీ కమ్యూనిటీలతో పాటు ప్రజలందరి మధ్య శత్రుత్వాన్ని, విద్వేషాలను రగిలించే గ్రూపులను నిషేధించి తీరతామని పేర్కొంది. ఆ లిస్ట్‌లో బజరంగ్‌ దళ్‌, పీఎఫ్‌ఐ కూడా ఉన్నాయి. దీంతో.. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోని ఈ అంశంపై బీజేపీపై భగ్గుమంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా నేతలంతా కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఈ తరుణంలో.. ఇప్పుడు కర్ణాటక ఆ ప్రకటనపై వెనక్కి మళ్లడం గమనార్హం.