News

బాలికను గర్బవతిని చేసిన పాస్టర్‌

236views

ఆంధ్ర ప్రదేశ్ లోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ప్రభువుకు ప్రతినిధిగా ఉండి.. ప్రార్థనలతో స్వస్థత చేకూరుస్తాడని నమ్మితే దారుణానికి తెగించాడు ఓ పాస్టర్. అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ పాస్టర్ పేరు బెజవాడ హోసన్నా. అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆ బాలికను గర్భవతిని చేశాడు.

ఆ తర్వాత పుట్టిన బిడ్డను మాయం కూడా చేశాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఆ ప్రాంతంలో ఇది సంచలనంగా మారింది. పుల్లేటికుర్రు శివారు చీకురుమిల్లివారిపేటలో పాస్టర్ బెజవాడ హోసన్న ఓ చర్చిని నిర్వహిస్తున్నాడు. ఈ చర్చిలో 17 ఏళ్ల బాలిక సభ్యురాలిగా ఉంది. ఆ బాలికకు తల్లి లేదు. అది అదనుగా తీసుకొని.. బాలికను లోబరుచుకున్నాడు పాస్టర్. ఆమెను గర్భవతిని చేశాడు.

మార్చి 5వ తేదీన ఆ బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ విషయం బయటికి పొక్కితే తన సంగతి బయటపడుతుందని భయపడిన పాస్టర్.. పుట్టిన వెంటనే బిడ్డను మాయం చేశాడు. బాలిక బంధువులకు ఈ విషయం తెలిసింది. బాలిక ప్రసవించి నెల రోజులు గడిచినా బిడ్డ ఆచూకీ లేకపోవడంతో వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాస్టర్ బిడ్డను అమ్మేసి ఉంటాడని కొందరు అనుమానించగా.. చంపేసి ఉంటాడని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో బాలిక బంధువులు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు బాలికకు న్యాయం చేయాలని కోరుతూ ఫిర్యాదు అందించారు. తల్లి లేని బాలికను మాయ చేసి,గర్భవతిని చేయడమే కాకుండా పుట్టిన బిడ్డను మాయం చేసిన పాస్టర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాలికకు పుట్టిన మగ బిడ్డ ఏమయ్యాడో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.