News

దేశ విభజనను పాక్‌ ప్రజలూ తప్పుబడుతున్నారు… రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్

213views

పాకిస్తాన్‌ ప్రజలు సంతోషంగా లేరని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. దేశ విభజన తప్పని పాకిస్తాన్‌ ప్రజలంతా అంటున్నారన్నారు. అఖండ భారత్‌ వాస్తవం కాగా విభజిత భారత్‌ ఒక పీడకల అని అభివర్ణించారు. భారతదేశ విభజన తప్పనే విషయాన్ని, స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల అనంతరం ఇప్పుడు వారు నమ్ముతున్నారని భగవత్‌ వ్యాఖ్యానించారు.

‘స్వాతంత్య్రానికి ముందు భారత్‌ నుంచి తెగదెంపులు చేసుకుని అహంకారపూరితంగా వెళ్లిన వారింకా సంతోషంగా ఉన్నారా? లేదు, బాధలు పడుతున్నారు’ అంటూ పాకిస్తానీయులనుద్దేశించి ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలపై ఆయన.. ‘పాకిస్తాన్‌పై భారత్‌ దాడి చేయాలన్నది నా ఉద్దేశం ఎంతమాత్రం కాదు. ఇతరులపై దాడులు చేయాలంటూ పిలుపునిచ్చే సంస్కృతి భారత్‌లో లేదు. ఆత్మరక్షణ కోసం దాడులకు తగిన బుద్ధి చెప్పాలనేదే భారత్‌ సంస్కృతి. దీనినే ఆచరిస్తాం. ఇదే కొనసాగుతుంది’అని పేర్కొన్నారు. స్వాతంత్య్ర యోధుడు హేము కలానీ జయంతిని పురస్కరించుకుని సింధీలు భోపాల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భగవత్‌ మాట్లాడారు.