
పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్ దేశం దాటినట్లు తెలుస్తోంది.
అతడు నేపాల్ లో నక్కినట్లు భారత్ విశ్వసిస్తోంది. ఈ క్రమంలోనే అతడు మరో దేశానికి పారిపోకుండా చూడాలని నేపాల్ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ మేరకు నేపాల్ కాన్సులర్ సేవల విభాగానికి అక్కడి భారత రాయబార కార్యాలయం లేఖ రాసినట్లు కాఠ్మాండూ మీడియా కథనాలు వెల్లడించాయి.
”అమృత్పాల్ సింగ్ నేపాల్లోనే దాక్కున్నాడు. అతడు దేశం విడిచి వెళ్లేందుకు అనుమతించొద్దు. భారత పాస్పోర్టు లేదా మరేదైనా పాస్పోర్టుతో అతడు పారిపోయేందుకు ప్రయత్నిస్తే అరెస్టు చేయండి” అని భారత రాయబార కార్యాలయం ఆ లేఖలో పేర్కొంది. ఈ లేఖతో పాటు అమృత్పాల్ వ్యక్తిగత వివరాలను అన్ని దర్యాప్తు సంస్థలు, ఇమ్మిగ్రేషన్ సేవల విభాగాలు, హోటళ్లు, ఎయిర్లైన్లకు పంపినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
పంబాజ్లో ఖలిస్థానీ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్న అమృత్పాల్ ను అరెస్టు చేసేందుకు ఇటీవల పోలీసులు పక్కా వ్యూహాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే అతడు చిక్కినట్లే చిక్కి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర వేట కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే అతడు హరియాణా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి దేశ సరిహద్దులు దాటి నేపాల్ వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.ఐఎస్ఐ ఆపరేషన్లకు అడ్డాగా నేపాల్
అమృత్పాల్కు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ మద్దతు ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఐఎస్ఐ ఏజెంట్లతో అతడికి విస్తృతంగా పరిచయాలున్నాయి. పాకిస్థాన్ నుంచి తరచూ పంజాబ్లోకి చొరబడే డ్రోన్ల ద్వారా అమృత్పాల్కు అవసరమైన ఆయుధాలు ఐఎస్ఐ ఏజెంట్లు సమకూర్చినట్లు అనుమానాలు కూడా ఉన్నాయి. కాగా.. నేపాల్ గత కొన్నేళ్లుగా ఐఎస్ఐ ఆపరేషన్లకు అడ్డాగా మారింది. ఆ దేశంలోని కొన్ని సంస్థలు పాకిస్థానీ ఐఎస్ఐ, లష్కరే తోయిబా ముఠాలకు స్వర్గధామంగా మారాయి. అక్కడే ఐఎస్ఐ.. స్లీపర్సెల్స్ను తయారుచేసి భారత్కు పంపిస్తున్నట్లు గతంలో అనేక కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే అమృత్పాల్ కూడా నేపాల్ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఐఎస్ఐ సానుభూతిపరుల అండతో పోలీసులకు చిక్కుకుండా నక్కి ఉంటాడని భారత్ అనుమానిస్తోంది. దీంతో అమృత్పాల్ పంజాబ్ పోలీసులకు చిక్కే అవకాశాలు మరింత సన్నగిల్లినట్లు కన్పిస్తోంది.
ఇక, అమృత్పాల్కు అనేక పేర్లతో పలు దేశాల పాస్పోర్టులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నకిలీ పాస్పోర్టులతో అతడు నేపాల్ నుంచి కూడా పారిపోయే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే భారత్.. పొరుగు దేశానికి లేఖ రాసింది. అతడు కెనడా పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు అనుమానాలున్నాయి.





