
ఈ నెల 18వ తేదీన పదకవిత పితామహుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యులవారి వర్ధంతి. శ్రీవేంకటేశ్వరస్వామివారికి పరమ భక్తుడైన అన్నమాచర్య 520వ వర్ధంతి కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు తిరుమలలో నిర్వహించనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు ఈ కార్యక్రమాలు ఆరంభమౌతాయి. ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఊరేగించనున్నారు.
సాయంత్రం 5:30 గంటలకు శ్రీమలయప్ప స్వామివారు ఊరేగింపుగా శ్రీవారి ఆలయం నుంచి బయలుదేరుతారు. 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేస్తారు. అనంతరం ప్రముఖ కళాకారులతో దిన ద్వాదశి సంకీర్తనలు, సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తారు. అనంతరం అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం 46వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామివారు అనుగ్రహ భాషణం చేస్తారు. తాళ్లపాక వంశీయులకు సన్మానంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది.
వారం రోజులుగా తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరం, మహతి ఆడిటోరియం, తిరుమల నారాయణగిరి ఉద్యానవనం, ధ్యాన మందిరంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అన్నమయ్య రాయచోటి జిల్లాలోని తాళ్లపాకలో నిర్మించిన 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద కూడా వర్ధంతి ఉత్సవాలు ఏకకాలంలో నిర్వహించనున్నారు. .




