News

సిఫార్సు లేఖల పేరుతో మోసం.. భక్తులకు తితిదే హెచ్చరిక!

123views

తిరుమలలో దళారులు, కేటుగాళ్ల బెడద తగ్గిపోయింది.. టీటీడీ కఠిన చర్యలు తీసుకోవడంతో ఇటీవల కాలంలో మోసాలు జరగడం లేదు. అయితే తాజాగా మరో ఇద్దరు దళారుల గుట్టురట్టైంది. తిరుమలకు వచ్చే భక్తుల్ని మోసం చేస్తున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వీరిద్దరు ప్రజాప్రతినిధుల సిఫార్సులు లేఖలు దుర్వినియోగం చేస్తూ.. తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. తమిళనాడు కృష్ణగిరి జిల్లాకు చెందిన బీఆర్‌ విష్ణు రెండు రోజుల క్రిత తిరుమల వచ్చారు. ఆయన శ్రీవారి బ్రేక్‌ దర్శనం కోసం చెన్నైకు చెందిన కృష్ణమూర్తి రఘురామన్‌, తిరుపతికి చెందిన కె.పళణి వెంకటేష్‌లను కలిశారు. ఆయనకు చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి సిఫారసు లేఖ ఇచ్చి.. ఐదు బ్రేక్‌ దర్శనం టికెట్లను రూ.35వేలకు విక్రయించారు. అయితే తర్వాత మోసపోయినట్లు గుర్తించిన భక్తులు టీటీడీ విజిలెన్స్‌ వింగ్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన దత్తాత్రేయ అనే భక్తుడు కూడా శ్రీవారి దర్శనం కోసం దళారి కృష్ణమూర్తి రఘురామన్‌ను సంప్రదించారు. రూ. 15 వేలకు 3 టిక్కెట్లను విక్రయించగా.. ఆయన కూడా మోసపోయినట్లు గుర్తించి టీటీడీ విజిలెన్స్‌ అధికారుకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచారు.. వారికి కోర్టు రిమాండ్‌ విధించింది. దర్శనం టికెట్ల కోసం దళారులను నమ్మొద్దని, మోసపోవద్దని విజిలెన్స్ సిబ్బంది భక్తులకు సూచించారు.