News

హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసు ఎన్ఐఏకి బదిలీ.. !

317views

హైదరాబాద్‌ నగరంలో పేలుళ్ల కుట్ర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల ఆదేశాల మేరకు యువతను రిక్రూట్‌ చేసుకుని.. హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్రపన్నిన అబ్దుల్ జాహేద్ కేసు ఎన్ఐఏకి బదిలీ అయ్యింది. పేలుళ్ల కుట్రపై ఎన్ఐఏ కేంద్ర హోంశాఖ ఆదేశాలతో కేసు నమోదు చేసింది. గత ఏడాది(2022) అక్టోబర్ నెలలో సిట్ నమోదు చేసిన కేసు ఆధారంగా జనవరి 25న ఎన్ఐఏ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే జాహేద్ ముఠాను అరెస్ట్ చేశారు. జాహేద్తోపాటు నిందితులైన షారూఖ్, సమియొద్దీన్ చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. గతంలో ఈ నిందితుల నుంచి 4 హ్యాండ్ గ్రెనేడ్లు, 5.41 లక్షల నగదు, 5 ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. దసరా సందర్భంగా జాహేద్ పేలుళ్లకు కుట్ర చేశాడు. ఈ ముఠా పాకిస్థాన్ నుంచి మనోహారాబాద్‌కు హ్యాండ్ గ్రనేడ్లు తరలించారు. జాహేద్ అనుచరుడు మనోహారాబాద్ నుంచి హైదరాబాద్‌కు గ్రనేడ్లు తీసుకొచ్చాడు. 15 ఏళ్ల క్రితం టాస్క్ ఫోర్స్ కార్యాలయం పేలుడు ఘటనలో జాహేద్ నిందితుడుగా ఉండటం గమనార్హం.