News

అరక్కోణం ద్రౌపది అమ్మన్‌ ఆలయ ఉత్సవాల్లో విషాదం.. క్రేన్ బోల్తా పడటంతో నలుగురు మృతి

64views

తమిళనాడు అరక్కోణంలో ఘోర ప్రమాదం జరిగింది. రాణిపేట జిల్లా కిలివీడి మాండియమ్మన్‌ ఆలయంలో భక్తులపై కుప్పకూలింది ఓ భారీ క్రేన్‌. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఓ బాలిక సహా తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని పున్నై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మైలార్‌ ఉత్సవాల్లో జరిగింది ఈ విషాద ఘటన. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ దాదాపు 1500 మంది భక్తులు ఉన్నారు. ఈ క్రేన్ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారగా.. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు.

రాణిపేట జిల్లా నెమిలి వట్టం కిలివీధి గ్రామంలోని ద్రౌపది ఆలయంలో మైలార్ ఉత్సవం జరుగుతోంది. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా పండుగ సందర్భంగా క్రేన్ బోల్తా పడి ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. క్రేన్ ద్వారా అమ్మవారికి పూలమాలలు వేసేందుకు ప్రయత్నించారు. అయితే పూలమాలలు వేస్తుండగా క్రేన్ ముందు భాగం ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. దీంతో భక్తులపై క్రేన్ పడిపోయింది.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఆలయంలో భారీగా జనం ఉన్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. క్రేన్‌తో అమ్మవారికి పూలమాల వేయడానికి ప్రయత్నిస్తున్నారు. క్రేన్‌పై కొందరు వ్యక్తులు ఉన్నట్లు కూడా స్పష్టమైంది. ఎవరూ ఊహించని విధంగా క్రేన్ ఎడమవైపుకు ఒరిగిపోవడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది.