




కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నూతన పార్లమెంట్ భవనం నిర్మాణం దాదాపు పూర్తయింది. దేశ ప్రజల భవిష్యత్ కోసం ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు నిలయమైన ఈ భవనం ప్రస్తుతం తుది హంగులు అద్దుకుంటోంది. జనవరి 31 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో నిర్మాణపనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే, తాజా బడ్జెట్ సమావేశాలను (Budget 2023) నూతన భవనంలో నిర్వహిస్తారా? పాత భవనంలోనే కొనసాగిస్తారా? అన్న దానిపై స్పష్టత లేదు. నిజానికి నవంబరు 2022 నాటికే నూతన పార్లమెంట్ భవన నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. అయితే, వివిధ కారణాలతో ఆలస్యమైంది. జనవరి చివరి నాటికి ‘సెంట్రల్ విస్తా’ ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు నిర్మాణ బాధ్యతలను తీసుకున్న కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా పార్లమెంట్ నూతన భవనానికి సంబంధించిన ఫొటోలను అధికారిక వెబ్సైట్ https://centralvista.gov.in/new-parliament-building.php లో ఉంచింది. ఈ నెలలో తీసిన ఫొటోలతోపాటు ప్రాజెక్టు ప్రారంభం నుంచి వివిధ దశల్లో తీసిన ఫొటోలను అందులో చూడొచ్చు.





