
దేశంలోని మహా నగరాలలో బెంగళూరు ఒకటి. ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ నగరంలో ఇంట్రాసిటీ హెలికాప్టర్ సర్వీసులు ప్రవేశపెట్టారు. ఫ్లైబ్లేడ్ ఇండియా, హంచ్ వెంచర్స్, బ్లేడ్ ఎయిర్ మొబిలిటీ జాయింట్ వెంచర్ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హోసూర్ ఏరోడ్రోమ్కు కలుపుతూ ఇంట్రా-సిటీ హెలికాప్టర్ సేవలను ప్రవేశపెట్టారు. ఆన్ డిమాండ్ సర్వీస్ ప్రకారం ఈ హెలికాప్టరు సేవల కోసం ప్రతి వారంలో ఒక్కొక్కరికి రూ.6000 చొప్పున చార్జ్ చేస్తారు.హోసూర్ నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి రావడానికి సాధారణంగా రోడ్డుపై వెళ్తే 3 గంటల సమయం పడుతుంది. బ్లేడ్ ఇండియా వారి హెలికాప్టర్ సేవలతో 20 నిమిషాల్లోపు విమానాశ్రయానికి చేరుస్తామని ఫ్లై బ్లేడ్ ఇండియా హామీ ఇచ్చింది.
నార్త్, సౌత్ బెంగుళూరు మధ్య ప్రయాణాన్ని సులభతరం చేయడానికి బ్లేడ్ ఇండియా ఈ మార్గాన్ని ప్రారంభించిందని అర్బన్ ఎయిర్ మొబిలిటీ బ్రాండ్ తెలిపింది. జనవరి 11వ తేదీ నుంచి బ్లేడ్ ఇండియా వెబ్సైట్లో హెలికాప్టర్ సేవల బుకింగ్ను తెరిచారు. బ్లేడ్ ఇండియా 2019వ సంవత్సరంలో ప్రారంభమైంది. మహారాష్ట్రలోని ముంబై, పూణే, షిర్డీల మధ్య విమానసర్వీసులను ఈ సంస్థ నడుపుతోంది. అప్పటి నుంచి హెలికాప్టర్ సర్వీసులను కర్ణాటక (కూర్గ్, హంపి, కబిని) గోవాలకు విస్తరించింది.





