News

జనాభా నియంత్రణపై బిహార్‌ సీఎం అనుచిత వ్యాఖ్యలు

338views

 

మహిళలు విద్యావంతులు కాకపోవడంతోపాటు పురుషులు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల జనాభా నియంత్రణ సాధ్యం కావడం లేదని బిహార్‌ సీఎం నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేపుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చేపట్టిన ‘సమాధాన్ యాత్ర’ లో భాగంగా వైశాలిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళలు చదువుకుంటే సంతానోత్పత్తి రేటు తగ్గుతుందన్నారు. ఇది వాస్తవమని, నేడు మహిళలు చదువుకోవడం లేదని తెలిపారు. ప్రతిరోజూ పిల్లల్ని కనకూడదనే విషయాన్ని పురుషులు తమ మనసులో పెట్టుకోవడం లేదన్నారు. మహిళలు విద్యావంతులు అవడం.. లేదా గర్భధారణను నిరోధించేందుకు ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు పాటించాలో తెలిస్తే జనాభా నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. ఇక నితీశ్ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు గురించి వివరించడానికి సరైనది కానటువంటి భాషను ఆయన ఉపయోగించారని ఆరోపించింది. బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ఇచ్చిన ట్వీట్‌లో, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అమర్యాదకరమైన భాషను బహిరంగంగా ఉపయోగించారని ఆరోపించారు. ఇటువంటి భాషను ఉపయోగించడం ద్వారా ఆయన ముఖ్యమంత్రి పదవి ఔన్నత్యానికి కళంకం తెస్తున్నారన్నారు.