
మూడో వంతు ప్రపంచ దేశాలు ఈ ఏడాది ఆర్థిక మాంద్యంలోకి జారుకునే ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ చీఫ్ క్రిస్టాలినా జార్జీవా హెచ్చరించారు. అమెరికా, చైనా, ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశాలు ఉన్నందున.. కిందటి ఏడాది కంటే ఈ సంవత్సరం సంక్లిష్టంగా ఉండొచ్చని తెలిపారు.
‘‘కొన్ని దేశాలు ఆర్థిక మాంద్యంలో లేనప్పటికీ.. అక్కడ నివసించే కోట్లాది మంది ప్రజలు ఆర్థిక మాంద్యపు ప్రభావాన్ని చవిచూసే అవకాశం ఉంటుందని’’ ఐఎంఎఫ్ చీఫ్ స్పష్టం చేశారు. పది నెలలుగా కొనసాగుతున్న ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియని సమయంలో ఈ ఆర్థిక మాంద్యం వస్తోందన్నారు. అత్యధిక వడ్డీ రేట్లు, చైనాలో కరోనా సంక్రమణలు దీనికి మరింత ఆజ్యం పోస్తున్నాయని తెలిపారు.
‘ప్రపంచంలోని మూడింట ఒక వంతు ఆర్థిక మాంద్యంలో చిక్కుకోనున్నది’ అని జార్జివా అన్నారు. అమెరికా, యూరొప్ యూనియన్, చైనా ఆర్థిక వ్యవస్థలు మందకొడి కావడంతో 2023వ సంవత్సరం మరింత దుర్భరంగా ఉండనున్నదని ఆమె చెప్పారు. ‘ రానున్న కొన్ని నెలలపాటు చైనాకు కష్టకాలమే. చైనా వృద్ధి రేటు మందగించే అవకాశం ఉంది. ఈ ప్రభావం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలపై కూడా పడుతుంది’’ అని ఆమె విశ్లేషించారు.
అయితే అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిరేటు అంచనాలను ఐఎంఎఫ్ ఏటా విడుదల చేస్తుంటుంది. 2021లో 6 శాతం, 2022లో 3.2 శాతం వృద్ధిరేటులను అంచనా వేసిన ఐఎంఎఫ్.. 2023 సంవత్సరానికి కేవలం 2.7 శాతం వృద్ధిరేటే సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. ఈ అంచనాలకు ఊతమిచ్చేలా ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జీవా తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
సోర్సు- నిజం టుడే