
గాంధీనగర్: గుజరాత్లోని 33 జిల్లా కేంద్రాలకు ‘ట్రూ 5జీ’ సేవలు అందిస్తున్నామని శుక్రవారం రిలయన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో ఈ సేవలు దేశంలోని 10 ప్రాంతాలకు విస్తరించినట్లైంది. మోడల్ స్టేట్ కింద గుజరాత్లోని విద్యా, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు సహా చాలా రంగాల్లో జియో సేవలు అందుబాటులోకి వచ్చాయి. భవిష్యత్లో ఈ సేవలను దేశం మొత్తం విస్తరించనున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ చేపట్టిన ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’ కార్యక్రమం కింద తొలుత 100 పాఠశాలలను డిజిటలైజేషన్ చేయనున్నారు. ”అన్ని జిల్లా కేంద్రాలు 5జీకి అనుసంధానమైన తొలిరాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. టెక్నాలజీ ఎంత శక్తిమంతమైందో.. అది కోట్ల మంది జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో మేము నిజంగా చూపించాలనుకుంటున్నాం” అని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు.
మరోవైపు నవంబర్ 23 నుంచి జియో ట్రూ 5జీ సేవలు 1జీబీపీఎస్ వేగంతో పుణెలో అందుబాటులోకి వచ్చాయి. గత వారం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ ఇతర ప్రధాన ప్రాంతాల్లో కూడా మొదలయ్యాయి. ఇక ఈ నెల రెండో వారంలో హైదరాబాద్, బెంగళూరుల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. సేవల్లో నాణ్యత కోసమే ట్రూ-5జీ సేవలను వివిధ నగరాల్లో దశలవారీగా ప్రారంభిస్తున్నట్టు జియో వెల్లడించింది. జియో ట్రూ-5జీ వెల్కమ్ ఆఫర్లో భాగంగా, ప్రస్తుత వినియోగదార్లు ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండా 1జీబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా పొందొచ్చని పేర్కొంది.
Source: Eenadu