News

మోర్బీ విషాదం.. సుమోటోగా గుజరాత్‌ హైకోర్టు విచారణ

302views

గాంధీనగర్‌: గుజరాత్‌లోని మోర్బీలో తీగల వంతెన కూలిన విషాద ఘటనలో 135 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనను ఆ రాష్ట్ర హైకోర్టు సుమోటోగా విచారణకు తీసుకుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతోపాటు స్థానిక అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుత స్థితిపై నవంబర్‌ 14లోగా నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తీగల వంతెన దుర్ఘటనపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా విచారించాలని రాష్ట్ర హైకోర్టు నిర్ణయించింది. ఇందులో భాగంగా హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌, జస్టిస్‌ అయుతోష్‌ శాస్త్రితో కూడిన ధర్మాసనం.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, హోంశాఖ, మోర్బీ మున్సిపల్‌ కమిషనర్‌, కలెక్టర్‌తోపాటు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను నవంబర్‌ 14న చేపడతామని తెలిపింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి నివేదికను అందజేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు హైకోర్టు ధర్మాసనం సూచించింది.

మోర్బీ ఘటనపై చర్యలు చేపట్టిన గుజరాత్‌ ప్రభుత్వం.. స్థానిక మున్సిపాలిటీ చీఫ్‌ ఆఫీసర్‌(సీవో)ను సస్పెండ్‌ చేసింది. బ్రిటిష్‌ కాలం నాటి ఈ వంతెనకు మరమ్మతులు నిర్వహించిన తర్వాత సేఫ్టీ సర్టిఫికెట్‌ తీసుకోకుండానే తిరిగి తెరిచినట్టు గుర్తించిన ప్రభుత్వం.. మున్సిపల్‌ అధికారిపై వేటు వేసింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తోన్న పోలీసులు.. ఇప్పటివరకు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మరోవైపు ఈ విషాదంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇప్పటికే ఆదేశించారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి