188
న్యూఢిల్లీ: అవినీతిపరులకు, ఉగ్రవాదులకు, డ్రగ్స్ అక్రమ వ్యాపార వర్గాలకు, వేటగాళ్ల గ్యాంగులకు, వ్యవస్థీకృత నేరాలకు స్వర్గధామాలంటూ ఎక్కడా ఉండబోవని, ఈ ప్రమాదాలను అరికట్టడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మంగళవారం న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ 90వ సమావేశాలను ఆయన ప్రారంభించారు.
సురక్షితమైన ప్రపంచాన్ని నెలకొల్పడమే మనందరి సమష్టి బాధ్యతగా మోదీ పేర్కొన్నారు. అవినీతి, ఆర్థిక నేరాలు చాలా దేశాల పౌరుల సంక్షేమానికి హాని కలిగిస్తున్నాయని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ఈ ఇంటర్పోల్ సమావేశంలో 195 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచ సంక్షోభాల్లో భారత్ బాధ్యత గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ మంచి శక్తులన్నీ సహకరిస్తే నేరశక్తులు పనిచేయబోవని ప్రధాని సూచించారు.
Source: Nijamtoday