
న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ (యుఎన్హెచ్ఆర్సి) తన ప్రత్యేక దూతగా తొలిసారిగా ఒక భారతీయురాలిని నియమించింది. ఆ మేరకు చరిత్ర సృష్టించిన ఆ యువతి పేరు అశ్విని కె.పి. బెంగళూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న 36 ఏళ్ల అశ్విని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కు ప్రత్యేక దూతగా ఉంటూ… దాని కార్యకలాపాలను నమోదు చేయడమే కాకుండా జాతి వివక్ష, జాత్యహంకారం, విదేశీయుల పట్ల ద్వేషం గురించి వివిధ దేశాల్లో పెచ్చరిల్లుతున్న ధోరణులను స్వతంత్రస్థాయిలో నివేదిస్తుంది.
తొలి దళిత యువతి
‘స్త్రీగా, దళిత స్త్రీగా నేను ఈ అవకాశం పొందడం చాలా ప్రాముఖ్యమైన సంగతి’ అంటోంది అశ్విని. జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ సమావేశాలలో కీలకమైన నిర్ణయం వెలువడింది. జాతి వివక్షను నివేదించేందుకు స్వతంత్య్ర నిపుణురాలిగా (ప్రత్యేక దూతగా) మొదటిసారి ఒక భారతీయురాలి ఎంపిక జరిగింది.