
ఇరాన్: కఠిన మత చట్టాలకు పేరుగాంచిన ఇరాన్ గడ్డపై మరో దారుణం చోటు చేసుకుంది. ఈ మధ్యే ఉరి శిక్ష పడ్డ ఓ మహిళకు.. ఆమె కూతురితోనే కుర్చీ తన్నించి తల్లికి ఉరి వేయించింది అక్కడి ప్రభుత్వం. తాజాగా హిజాబ్ ధరించనందుకు ఓ యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శవంగా ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన ఇరాన్ వ్యాప్తంగా దుమారం రేపుతోంది.
మహ్సా అమినీ(22) అనే యువతి గతవారం తన కుటుంబంతో టెహ్రాన్ ట్రిప్కు వెళ్ళింది. అయితే ఆమె హిజాబ్ ధరించకపోవడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో పాటించాల్సిన డ్రెస్ కోడ్ను ఉల్లంఘించిందంటూ అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అయితే, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదుగానీ.. ఆమెను హఠాత్తుగా ఆస్పత్రిలో చేర్చారు.
అమినీ కోమాలోకి వెళ్ళిందని ప్రకటించిన పోలీసులు.. చివరకు శనివారం ఆమె కన్నుమూసినట్టు ప్రకటించారు. అమినీ మృతిపై పోలీసులు అనుమానాస్పద ప్రకటన చేయకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు వ్యతిరేకంగా వందల మంది ప్రజలు ఆస్పత్రి బయట ఆందోళనకు దిగారు. ఓ ప్రైవేట్ఛానెల్ మాత్రం కస్టడీలో ఆమెను హింసించారని, తలకు బలమైన గాయం అయ్యిందని, ఒంటిపై గాయాలు ఉన్నాయని పేర్కొంది.