News

త్రివిధ దళాలలో లక్షా ముప్పై ఐదు వేల పోస్టులు ఖాళీ: కేంద్రం వెల్ల‌డి

423views

న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో 1,35,784 పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అత్యధికంగా ఆర్మీలో 1,16,464 పోస్టులు ఖాళీగా ఉండగా.. నౌకాదళంలో 13,537, వాయుసేనలో 5,723 ఖాళీలు ఉన్నాయని తెలిపింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో ఏటా సగటున భర్తీలు 60 వేలు, 5332, 5723గా ఉన్నట్టు కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌ వెల్లడించారు.

ఆఫీసర్, నాన్-ఆఫీసర్ ర్యాంక్ సిబ్బందితో సహా మొత్తం త్రివిధ దళాల్లో సిబ్బంది కొరతపై భట్ వివరణ ఇచ్చారు. అధికారికంగా ఉండాల్సిన సంఖ్యతో పోలిస్తే జనవరి 1 నాటికి సైన్యంలో 1,16,464 మంది సిబ్బంది కొరత ఉన్నట్టు చెప్పారు. అదే 2020 జనవరిలో సైన్యంలో 64,482 ఖాళీలు ఉన్నాయి. మరోవైపు నావికాదళంలో ఈ ఏడాది మే నాటికి 13,597 పోస్టులు ఖాళీగా ఉండగా.. జులై 1 నాటికి వైమానిక దళంలో 5,723 ఖాళీలు ఉన్నట్టుగా వివరించారు. ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘అగ్నిపథ్‌’ పేరిట కొత్త రిక్రూట్‌మెంట్ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీని కింద.. త్రివిధ దళాలు ఈ ఏడాది 46 వేల మంది అగ్నివీరులను నియమించుకోనున్నాయి. ఇప్పటికే రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను ప్రారంభించాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి