
-
జనజాతి సురక్ష మంచ్ సహా ప్రాంత ప్రముఖ్ గోపాల్ నాగ్ డిమాండ్
పాడేరు రూరల్ : మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఛత్తీస్గఢ్కు చెందిన జనజాతి సురక్ష మంచ్ సహా ప్రాంత ప్రముఖ్ జి.ఎస్. గోపాల్ నాగ్ డిమాండ్ చేశారు. ఇటీవల పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించారు. తలార్సింగి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, సినిమా హాల్ సెంటర్, పాత బస్టాండ్, మెయిన్ బజార్ మీదుగా సుండ్రుపుట్టు పెట్రోల్ బంకు వరకు ర్యాలీ చేపట్టారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో గోపాల్ నాగ్ మాట్లాడుతూ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు పాటించకుండా ఇతర మతాలను స్వీకరిస్తున్న గిరిజనులను ఎస్టీ జాబితాల్లో తొలగించి వారికి అన్ని రంగాల్లో రిజర్వేషన్లను రద్దు చేయాలన్నారు. ఈ విషయంపై పార్లమెంట్లో చట్టం తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనజాతి రాష్ట్ర ప్రతినిధి మినుముల గోపాల పాత్రుడు, జనజాతి సురక్ష మంచ్ జిల్లా ప్రతినిధి పాంగి రామయ్య, సభ్యులు మచ్చమ్మ, పి.బాలకృష్ణ, పాకలపాటి గురుదేవుల ఆశ్రమం అధ్యక్షుడు మత్య్సరాస మత్యరాజు, ఏజెన్సీ 11 మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Source: Sakshi





