
చెన్నై: కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ ఏ రాజా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేయకుంటే ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. డీఎంకే రాజ్యాంగాన్ని గౌరవించి ప్రత్యేక తమిళనాడు అంశాన్ని పక్కనపెట్టిందని ఏ రాజా పేర్కొన్నారు. ప్రత్యేక తమిళనాడు కోసం మేము పోరాడే పరిస్థితిని మాకు కల్పించవద్దని సూచించారు.
అన్ని రాష్ట్రాలతో కలిసి దేశ అభివృద్ధి కోసం పాటుపడాలన్నదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితులు లేవు, అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వాలకు స్వంతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదని డీఎంకే ఎంపీ రాజా పేర్కొన్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరిస్తుందంటూ మండిపడ్డారు. స్వాతంత్ర్యానికి ముందు, అనంతరం పలు పరిణామాలకు సంబంధించి తమిళనాడు స్వయంప్రతిపత్తి కోసం పోరాడుతూనే ఉందని రాజా అభిప్రాయపడ్డారు.





