
న్యూఢిల్లీ: భారత నావికాదళంలో మొట్టమొదటిసారి మహిళా సెయిలర్లను తీసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంలో భాగంగా ఈ నియామకాలను భర్తీ చేయనున్నట్టు నేవీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మొత్తంగా 3,000 మంది మహిళా అగ్నివీర్లను ఈ ఏడాది తీసుకోవాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ ఇది ఇంకా తుది నిర్ణయానికి రాలేదట.
ఈ విషయమై సోమవారం మీడియాతో చీఫ్ ఆఫ్ వైస్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాటి మాట్లాడుతూ ‘‘అగ్నిపథ్ పథకంలో భాగంగా నేవీ నియామకాల్లో లింగసమానత్వం ఉండేలా చూసుకుంటాం. అందుకే సముద్రంలోకి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్న మహిళలను సెయిలర్లుగా తీసుకోవాలని నిర్ణయించాం’’ అని తెలిపారు.
ఈ నెల 25 నాటికి నేవీ ప్రధాన కార్యాలయం పూర్తి వివరాలు వెల్లడిస్తుందని తెలిపారు. అగ్నిపథ్ రిక్రూట్మెంట్లో ఎంపికైన మొదటి బ్యాచ్కు ఈ ఏడాది నవంబర్ 21 నాటికి ఒడిశాలోని ఐఎన్ఎస్ చిల్కాలో శిక్షణ ప్రారంభిస్తామని వివరించారు.
Source: Nijamtoday





