
భాగ్యనగరం: జూబ్లీహిల్స్ లో మైనర్పై గ్యాంగ్ రేప్ నిందితుల పట్ల పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్న సమయంలో అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బైటపెట్టి ప్రముఖుల కొడుకులను నిందితులుగా చేర్చే విధంగా చేసిన బీజేపీ ఎమ్యెల్యే ఎన్ రఘునందనరావు తాజాగా నిందితులలో ఒక్కరు తప్ప, మిగిలిన వారంతా మైనర్లు కావడంతో వారి పేర్లు బైటపెట్టలేమని పోలీసులు చేస్తున్న వాదనలను కూడా కొట్టిపారేశారు.
అత్యాచారానికి పాల్పడ్డ వారు మైనర్లు కాదని, వారంతా మేజర్లేనని మరో సంచలన ప్రకటన చేశారు. ఘాతుకానికి పాల్పడ్డ వారంతా ఎంఐఎం నేతల కుమారులు, బంధువులు, సన్నిహితులు అయినందున కేసును నీరు గార్చేందుకు పోలీసులు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారని ఒక టీవీలో ప్రసారమైన క్వశ్చన్ అవర్లో పేర్కొన్నారు.
కేసు రుజువైనా మైనర్లంటే శిక్ష తగ్గుతుంది కాబట్టి మేజర్లు అయిన నిందితులను మైనర్లని చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుందని, వారి దర్యాప్తు పూర్తయిన అనంతరం అవసరమైతే తాను కోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు. పోలీసులు మైనర్లుగా పేర్కొంటున్న వారందరూ మేజర్లేనని, తన వద్ద అందుకు పూర్తి ఆధారాలున్నాయని వెల్లడించారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, కేసు దర్యాప్తులో ఉందన్నారని, ఇప్పటికైనా మైనర్లన్న వారికి సంబంధించిన మరిన్ని వివరాలను తెప్పించుకుని పరిశీలిస్తే మేజర్లని తేలుతుందని బీజేపీ నేత సూచించారు. ఎంఐఎం నేతలకు భయపడుతున్న పోలీసులు సరైన విధంగా కేసు దర్యాప్తు చేయడం లేదని ఆరోపించారు.
నిజంగా పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే మైనర్లంటున్న వారికి సంబంధించిన పుట్టిన సర్టిఫికెట్లను పరిశీలించాలని, 10 తరగతి మార్కుల జాబితాను, స్కూళ్ళలో నమోదైన పుట్టిన తేదీలను పరిశీలిస్తే వాస్తవం ఏమిటన్నది తెలుస్తుందని రఘునందనరావు హితవు చెప్పారు.
Source: Nijamtoday





