News

తియానన్మెన్‌ స్క్వేర్ పేరెత్తితే శివాలెత్తుతున్న చైనా

545views

తియానన్మెన్‌ స్క్వేర్‌ ఘటనకు సంబంధించిన జ్ఞాపకాలను పూర్తిగా తుడిచివేసే కార్యక్రమాన్ని చైనా ఇప్పటికీ కొనసాగిస్తోంది. ముఖ్యంగా ప్రతి ఏడాది జూన్ 4వ తేదీన మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కానీ..ఈ సారి ఇది అంత బాగా పనిచేసినట్లు కనిపించలేదు. చాలా మంది నెటిజన్లు తియానన్మెన్‌ స్క్వేర్‌ ఘటనను పేర్కొన్నారు. శుక్రవారం చైనాలోని టాప్‌ ఈ కామర్స్‌ ఇన్వెస్టర్‌ లీజియాకీ తన షోలో సహ హోస్ట్ ‌తో కలిసి వియన్నెట్టా ఐస్ ‌క్రీమ్ ‌ను ప్రదర్శించారు. దీనిని బ్రిటిష్‌ బ్రాండ్‌ అయిన వాల్స్‌ కంపెనీ నుంచి కొనుగోలు చేశారు. ఈ ఐస్‌క్రీమ్‌ చుట్టూ ఓరియో బిస్కెట్లు అతికించారు. పైన చాక్లెట్‌ స్ట్రా వంటి దాన్ని ఏర్పాటు చేశారు. ఇది చూడటానికి యుద్ధ ట్యాంకులా ఉంది. దీనిని జూన్‌4వ తేదీ రావడానికి కొద్ది సేపటి ముందు అర్ధరాత్రి ప్రదర్శించారు. తియానన్మెన్‌ స్క్వేర్‌ ఘటనకు చిహ్నంగా తరచూ యుద్ధట్యాంకునే ప్రదర్శిస్తోన్న విషయం తెలిసిందే.

లీజియాకీ ఐస్‌క్రీమ్‌ను ప్రదర్శిస్తోన్న సమయంలోనే చాలా మందికి అదేమిటో అర్థం కాలేదు. అదే సమయంలో ఒక్కసారిగా లైవ్‌ స్ట్రీమ్‌ కట్‌ అయ్యింది. తమ టీమ్‌ సాంకేతిక సమస్యలను సరిచేస్తోందని లీ వెల్లడించారు. కానీ, రెండు గంటల తర్వాత లైవ్‌లోకి వచ్చి పాత లైవ్‌ పునరుద్ధరించడం కుదరదని చెప్పారు. ‘లైవ్ ‌లో ప్రసారం చేయని వస్తువులను కూడా మీకు అందుబాటులోకి తెస్తాం’ అని పేర్కొన్నారు.

ఆ తర్వాత లీ పేరును టౌబౌ అనే ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో సెర్చి చేస్తే సరైన రిజల్ట్స్‌ చూపించడంలేదు. టౌబౌ ప్లాట్‌ఫామ్‌పైనే అతడు లైవ్‌స్ట్రీమింగ్‌ షోను నిర్వహించారు. అతడికి 6 కోట్ల మంది వరకు ఫాలోవర్లు ఉన్నారు. తియానన్మెన్‌ స్క్వేర్‌ ఘటన విషయాలు బయటకు రాకుండా చైనా ఇప్పటికీ ఏ స్థాయిలో అణచివేస్తోందో ఈ ఘటనను చూస్తే అర్థమవుతుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.