News

అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకంగా భారత బ్యాంకులు: ప్రధాని మోదీ

422views

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్యం, సరఫరా వ్యవస్థల్లో భారత బ్యాంకులు, కరెన్సీని భాగం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇందుకోసం ఆర్థిక సంస్థలు మెరుగైన ఆర్థిక, కార్పొరేట్ పాలనా పద్ధతులను అనుసరించాలని ఆయన సూచించారు.

75 ఏళ్ళ‌ స్వాతంత్య్ర వేడుక‌లను పురస్కరించుకుని నిర్వహిస్తోన్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రతిష్ఠాత్మక వారోత్సవాల ప్రారంభ సభలో ప్రధాని మాట్లాడారు. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇప్పటికే భారత్ అనేక ఆర్థిక పరిష్కార వేడుకలను ఆవిష్కరించిందని, వాటి వినియోగాన్ని పెంచడం కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధాని సూచించారు.

అలాగే వాటన్నిటినీ విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భారత్‌ను ప్రపంచం ఇప్పుడు ఒక పెద్ద వినియోగ మార్కెట్‌గానే కాకుండా అనేక సమస్యలకు పరిష్కార వేదికగా చూస్తోందని మోదీ వ్యాఖ్యానించారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ వేదికపై సోమవారం కొత్త నాణేల శ్రేణిని ఆవిష్కరించారు. అంధులు కూడా సులభంగా గుర్తించేలా వీటిని రూపొందించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లోగోను రూ.1, రూ.2, రూ. 5, రూ.10,రూ.20, మారకపు విలువ కలిగిన కొత్త నాణేలపై ముద్రించారు.

ఇవి కేవలం స్మారక నాణేలు మాత్రమే కాదని, త్వరలో చెలామణి లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఈ కొత్త నాణేలు దేశాభివృద్ధి కోసం పనిచేసేలా ప్రజల్లో స్ఫూర్తి నింపుతాయని మోదీ తెలిపారు. 12 ప్రభుత్వ పథకాలతో అనుసంధానించిన జన సమ్మర్ధ్ పోర్టల్‌ను కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రారంభించారు. ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ కూడా పాల్గొన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి