
* ఆ అంశంపై చర్చిస్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడి
రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో అర్చకులుగా బ్రాహ్మణేతరుల నియామకంపై చర్చ జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని అన్ని దేవాలయాల్లో ఆన్లైన్ ప్రక్రియపై దృష్టి పెట్టామని తెలిపారు.
ధార్మిక పరిషత్, ఎండోమెంట్స్ ట్రైబ్యునల్ కు సంబంధించి కూడా త్వరలోనే నిర్ణయం ఉంటుందని మంత్రి చెప్పారు. దేవాదాయ శాఖకు సంబంధించి కోర్టుల్లో 5వేల కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటి సత్వర పరిష్కారం కోసం త్వరలోనే అదనపు న్యాయ సలహాదారును నియమించుకుంటామని వెల్లడించారు. దేవాదాయశాఖలో అవినీతిని అరికట్టేందుకు విజిలెన్స్ సెల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా మంత్రి చెప్పారు.
విజయవాడ కనకదుర్గ దేవాలయంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులు చేపట్టామని మంత్రి సత్యనారాయణ తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా కనకదుర్గ ఆలయంలో పనులు చేపడుతున్నామన్నారు. ప్రతీ దేవాలయంలోనూ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తున్నట్టు మంత్రి వివరించారు.





