నంద్యాల: నంద్యాల జిల్లా, స్థానిక ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో “కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం” (దేవాలయ పారిశుద్ధ్య కార్యక్రమం) జరిగింది. హిందూ బంధువులందరిని ధర్మం వైపు నడిపించే ఏకైక శ్రద్ధా కేంద్రాలు దేవాలయాలు. వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, వాటి అభివృద్ది గురించి ఆలోచించడం మనందరి బాధ్యత అని తలచిన భక్తులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సంప్రదాయ దుస్తులతో పురుషులు, మాతృమూర్తులు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం దేవాలయంలో చేపట్టారు. ఇందులో భాగంగా గోశాల , గోవులు శుభ్రం చేయటం వంటి కార్యక్రమాలు చేపట్టారు.
పెద్దలు చాగంటి కోటేశ్వరరావు చెప్పినట్టు మన గుడిని మనమే శుభ్రం చేసుకోవాలి, అలా చేస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుందని.. ఇంకా పిల్లలకు ఆదర్శంగా ఉంటుందన్న దృష్టితో హిందువులందరూ సంస్థలతో సంబంధం లేకుండా ప్రతి ఏకాదశి రోజున వారి వారి వీధిలోని, కాలనీలోని గుళ్ళను శుభ్రం చేసుకోని దేవుడి కృపను పొందగలరని, దీనిని ఆచారంగా మార్చుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శివకుమార్ రెడ్డి, వై.రాంప్రసాద్, ఎ.రవి, హిందూ బంధువులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.