
ముంబై: లౌడ్స్పీకర్ల అంశంపై మహారాష్ట్రలో దుమారం రేగుతోంది. మసీదుల్లో లౌడ్స్పీకర్లు తొలగించాలని ఇదివరకే ప్రజలకు పిలుపునిచ్చారు మహారాష్ట్ర నవ్నిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే. ఈ నెల నాలుగో తేదీలోగా వాటిని తొలగించని పక్షంలో.. మసీదుల ఎదురుగా లౌడ్స్పీకర్లలో హనుమాన్ చాలీసా పఠించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముంబయి ఛర్కోప్లోని ఓ మసీదు సమీపంలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు లౌడ్స్పీకర్లలో హనుమాన్ చాలీసా వినిపించారు.
పార్టీ జెండా పట్టుకున్న ఓ ఎంఎన్ఎస్ కార్యకర్త.. హనుమాన్ చాలీసా పఠిస్తూ కనిపించాడు. ఈ మేరకు ఓ వీడియో బయటకు వచ్చింది. అదే సమయంలో ఎదురుగా ఉన్న మసీదు నుంచి లౌడ్స్పీకర్లలో ‘ఆజాన్’ వినిపిస్తోంది. మరోవైపు ఠాణెలోని ఇందిరా నగర్ ప్రాంతంలోనూ కొందరు ఎంఎన్ఎస్ కార్యకర్తలు స్పీకర్లతో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ కనిపించారు.
నాలుగో తేదీ నుంచి మసీదులపై లౌడ్స్పీకర్లు మూగబోయేలా చేయాలంటూ ఇదివరకే వివాదాస్పద ప్రకటన చేసిన ఠాక్రేపై ఔరంగాబాద్లో పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. గత రాత్రి పోలీసులు నోటీసు అందించారు. ఆయన తన వ్యాఖ్యల నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మసీదుల నుంచి ఆజాన్ వినిపిస్తే వెంటనే 100కు డయల్ చేసి పోలీసు కంట్రోల్ రూంకు చెప్పాలని, హనుమాన్ చాలీసాను లౌడ్ స్పీకర్లలో వినిపించాలని ప్రజలకు మరోసారి పిలుపునిచ్చారు.





